
ములుగు, వెలుగు: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలపై దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ములుగులో కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీని మంగళవారం రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డితో కలిసి సందర్శించారు. కలెక్టర్ హైమావతి, యూనివర్సిటీ వీసీ దండ రాజిరెడ్డితో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం యూనివర్సిటీలో అక్షయపాత్ర భోజనశాలను ప్రారంభించారు. ఉద్యానవనరంగాన్ని బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతు కమిషన్ సభ్యులు రఘునందన్, భవాని రెడ్డి పాల్గొన్నారు.