
మక్తల్, వెలుగు: అంగన్వాడీ టీచర్ల సమస్యలను క్యాబినెట్ మీటింగ్లో చర్చిస్తానని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సోమవారం మక్తల్లో అంగన్వాడీ టీచర్లు, సీఐటీయూ నాయకులు మంత్రి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచారం కోసం మంత్రుల ఇళ్లను ముట్టడించడం ద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు. సమస్యల పరిష్కారం కోసం కూర్చొని చర్చిద్దామని సూచించారు.
అంగన్వాడీ టీచర్ల సమస్యలను త్వరలో జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఆంజనేయులు, గోవింద్ రాజ్, రమేశ్ పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి..
మక్తల్ నియోజకవర్గంలో విద్యారంగ సమస్యలను పరిష్కారించాలని డీటీఎఫ్ నాయకులు మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా సంఘంజిల్లా అధ్యక్షురాలు హైమావతి, ప్రధాన కార్యదర్శి సూర్యచంద్ర మాట్లాడుతూ మక్తల్ మండలంలోని మంతన్ గోడ్ జడ్పీ హైస్కూల్లో ఇప్పటికీ పోస్ట్ శాంక్షన్ కాలేదన్నారు. ఈ స్కూల్కు కాట్రేవుపల్లి, గోలపల్లి, టేకులపల్లి గ్రామాల నుంచి 200 మంది విద్యార్థులు వస్తున్నారని తెలిపారు. పీడీ పోస్టు లేకపోవడంతో విద్యార్థులు ఆటల్లో వెనకబడి పోతున్నారని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
మంత్రి జూపల్లి ఆఫీస్ ముట్టడి..
కొల్లాపూర్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆఫీస్ను ముట్టడించారు. అనంతరం మంత్రి ఓఎస్డీ కృష్ణయ్యకు వినతిపత్రం అందజేశారు. నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, సీఐటీయూ నాయకులు పర్వతాలు, శివవర్మ, రామయ్య, రాము, నీరజ, హుస్సేన్, చిన్నమ్మ, లక్ష్మి, జ్యోతి, గోవిందమ్మ, సుశీల, భాగ్యమ్మ, జయమ్మ పాల్గొన్నారు.