ఎస్సారెస్పీ పునరుజ్జీవం ..ఉత్త దండుగ

ఎస్సారెస్పీ పునరుజ్జీవం ..ఉత్త దండుగ
  • ఎస్సారెస్పీ పునరుజ్జీవం ..ఉత్త దండుగ
  • ఆ ప్రాజెక్టు పేరుతో రూ.2 వేల కోట్ల ప్రజాధనం నీళ్లపాలు
  • గత ప్రభుత్వ తప్పిదాలను లేవనెత్తిన కాగ్​
  • శ్రీరాంసాగర్​ మొత్తం ఆయకట్టులో 66% 
  • ఎల్​ఎండీ కిందనే ఉండగా రివర్స్ పంపింగ్  దేనికి?
  • రివర్స్​ పంపింగ్​ ఆలోచనే కరెక్ట్​ కాదు 
  • కాళేశ్వరంలో అడుగడుగునా నిధుల దుర్వినియోగం, అక్రమాలు జరిగాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు :  శ్రీరాంసాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు అర్థరహితమని, దాని పేరిట గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం రూ. 2వేల కోట్ల ప్రజాధనాన్ని నీళ్లపాలు చేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) డ్రాఫ్ట్ రిపోర్టులో తప్పుబట్టింది.  90.58 టీఎంసీల సామర్థ్యంతో గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కాళేశ్వరం నుంచి నీటిని రివర్స్ పంపింగ్ చేయాలన్న ఆలోచనే సమర్థించుకోలేనిదని తేల్చిచెప్పింది. ఎస్సారెస్పీ కింద 13.67 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 346 కిలోమీటర్ల పొడవైన కాకతీయ కాల్వ కిందనే 13.05 లక్షల ఎకరాలు సాగవుతున్నాయని తెలిపింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్​లో 32 టీఎంసీల నీటిని కాకతీయ కాల్వలో వేసి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు మధ్యలో ఉన్న 5.39 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రతిపాదించారని, ఆ తర్వాత కాకతీయ కెనాల్ లోకి కాకుండా ఎస్సారెస్పీ వరద కాల్వకు నీటిని తరలించాలని డిజైన్ లో మార్పులు చేశారని, ఇలా ఎందుకు మార్చారనే రికార్డులు కూడా లేవని పేర్కొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని మొత్తం ఆయకట్టులో 65.76 శాతం లోయర్ మానేరు డ్యాం కిందనే ఉందని, అలాంటప్పుడు ఎస్సారెస్పీకి రివర్స్ పంపింగ్ ద్వారా రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి పునరుజ్జీవం ప్రాజెక్టు చేపట్టాల్సిన అసవరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. పునరుజ్జీవ పథకం కోసం కాకతీయ కాల్వను కాకుండా వరద కాల్వను ఉపయోగించుకోవడం, ఈ ప్రాజెక్టులో భాగంగా 60 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించడంతో కరెంట్ బిల్లుల భారం అధికమవుతున్నదని కాగ్​ తెలిపింది. 

కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి

కాళేశ్వరం పంపులు, మోటార్ల కొనుగోళ్లలో కాంట్రాక్టర్లకు 327 శాతం అదనపు చెల్లింపులు చేశారని కాగ్ గుర్తించింది. ఈ ప్రాజెక్టులు లిఫ్టులకు సంబంధించి 21 ప్యాకేజీలు ఉండగా అందులో నాలుగు ప్యాకేజీల్లో పంపులు, మోటార్లు సహా ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ ఎక్విప్ మెంట్ కొనుగోళ్లకు రూ.7,212 కోట్లుగా నాడు ప్రభుత్వం అంచనా వేసిందని, కానీ కాంట్రాక్టర్లు రూ.1,686 కోట్లు మాత్రమే బీహెచ్ఈఎల్​కు చెల్లించి కొనుగోలు చేశారు. తద్వారా ఆ నాలుగు ప్యాకేజీల్లో కాంట్రాక్టర్లకు అదనంగా రూ.5,526 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని కాగ్​ పేర్కొంది. ఈ నాలుగు పంపుహౌస్​ల రికార్డులతోపాటు మిగిలిన 17 ప్యాకేజీల్లోని పంపుహౌస్ ల రికార్డులను ప్రాజెక్టు అధికారులు తమకు ఇవ్వలేదని కాగ్​ తీవ్రంగా తప్పుబట్టింది. మొత్తం 21 ప్యాకేజీల్లో 8,338 మెగావాట్ల సామర్థ్యం గల పంపులు, మోటార్లను రూ. 18,936 కోట్లతో కొనుగోలు చేశారని తెలిపింది. ఇంజనీర్లు పనులకు టెండర్లు పిలిచే ముందు మొదట ఎస్టిమేట్లు తయారు చేస్తారు. స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ (ఎస్ఎస్ఆర్) ప్రకారం ఏవైనా వస్తువులు నిర్దేశిత ధరకు లభ్యం కాకపోతే మార్కెట్ నుంచి సేకరిస్తారు. మోటార్లు, పంపుల ధరలు ఎస్ఎస్ఆర్​లో ఉండవు.. కాబట్టి మార్కెట్ నుంచి సేకరించాలనే వెసులుబాటును ఆసరాగా తీసుకొని కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగించే ప్రయత్నం జరిగిందని కాగ్​ ఆక్షేపించింది. ప్రాణహిత – చేవెళ్ల లిఫ్ట్ స్కీం కోసం బీహెచ్ఈఎల్ నుంచి పంపులు, మోటార్ల కొటేషన్లు తీసుకునే వారు. కానీ.. కాళేశ్వరం మోటార్లు, పంపులు ఎక్కడి నుంచి సేకరించారనే వివరాలను తమకు సమర్పించలేదని, వీటి కొనుగోళ్లలో పారదర్శకత లేదని కాగ్ పేర్కొంది. కేవలం 6, 8, 10, 11 ప్యాకేజీల్లోని 2,805.76 మెగావాట్ల పంపులు, మోటార్లను బీహెచ్ఈఎల్ నుంచి సేకరించారని.. ప్రభుత్వం పంపులు, మోటార్ల సేకరణ వివరాలు ఇవ్వకపోవడంతో బీహెచ్ఈఎల్ ను  సంప్రదించి సప్లయ్ చేసిన మోటార్ల వివరాలు సేకరించినట్లు కాగ్​ తెలిపింది. 
    జెన్​కోలో రిటైర్డ్ అయిన ఇంజనీర్ ను గత ప్రభుత్వం సలహాదారుగా నియమించుకొని,  ఆయన వేసిన అంచనాలతోనే ఎస్టిమేట్లు రూపొందించి టెండర్లు పిలిచిందని, సదరు సలహాదారు రూపొందించిన ఎస్టిమేట్లకు ఆధారాలేమిటో తమకు అప్పటి ప్రభుత్వం వివరణ ఇవ్వలేదని కాగ్​ స్పష్టం చేసింది. ఒక్కో మోటారు కోసం కాంట్రాక్టర్​కు ప్రభుత్వం రూ.2.57 కోట్లు చెల్లించగా సదరు కాంట్రాక్టర్ బీహెచ్ఈఎల్ కు రూ.60 లక్షలు మాత్రమే చెల్లించారని కాగ్ ఆడిట్ లో తేలింది. నాలుగు ప్యాకేజీల్లో చెల్లించినట్టుగానే కాంట్రాక్టర్లకు 327 శాతం చొప్పున అదనంగా చెల్లించినట్టుగా లెక్కలోకి తీసుకుంటే రూ.4,435 కోట్ల విలువైన పనులకు రూ.18,936 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తున్నదని కాగ్​ పేర్కొంది. తద్వారా రూ.14,501 కోట్ల అక్రమాలు జరిగినట్టుగా సందేహం వ్యక్తం చేసింది. 
    పంపులు, మోటార్లే కాకుండా పవర్ హౌస్​లలో వాడే ఈవోటీ క్రేన్లు, మొబైల్ క్రేన్లు, జనరేటర్లు, బ్యాటరీలు, స్విచ్ గేర్ బోర్డులు, ట్రాన్స్ ఫార్మర్లు, ఎర్తింగ్ మెటీరియల్ కొనుగోళ్లలోనూ భారీ అక్రమాలు జరిగాయని కాగ్ గుర్తించింది. వీటి కోసం రూ.1,282 కోట్లు గంపగుత్తగా చెల్లించారని, ఇందులో ఏ పనికి ఎంత చెల్లించారు, ఏ ఆధారంగా చెల్లించారు.. అనే వివరాలేవి లేవని తప్పుబట్టింది. ప్రైస్ అడ్జస్ట్​మెంట్ కింద స్టీల్, సిమెంట్ ధరలలో మార్పుల పేరుతో కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపుల్లో రూ.1,342.28 కోట్ల అక్రమాలు జరిగాయని పేర్కొంది. 

రీ ఇంజనీరింగ్​తో వేస్ట్​ చేశారు

    ప్రాణహిత –  చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ ఇంజనీరింగ్ చేయడం ద్వారా ప్రాజెక్టు పనులు, సహా వివిధ రూపాల్లో 2016 నాటికి ఖర్చు చేసిన రూ.11,642.85 కోట్లలో రూ.767.67 కోట్లు వృథా అయ్యాయని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది.  తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు సైట్​ను మార్చడం ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్ ల నిర్మాణం కోసం అదనంగా రూ.21,879 కోట్ల భారం పడిందని తెలిపింది. 
    కరెంట్ బిల్లుల రూపంలో తుమ్మిడిహెట్టి నుంచి 160 టీఎంసీలు ఎత్తిపోయడానికి రూ. 212.89 కోట్లు మాత్రమే ఖర్చయితే.. అదే మేడిగడ్డ నుంచి 180 టీఎంసీలు ఎత్తిపోయడానికి రూ.1,549.80 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని, తద్వారా ఖజానాపై అదనంగా రూ.1,300 కోట్ల వరకు  కరెంట్ బిల్లుల భారం పడుతున్నదని కాగ్​ తేల్చిచెప్పింది.  
    రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మసాగర్ కు నీటిని తరలించడానికి రూ.74.07 కోట్లతో గ్రావిటీ కెనాల్ తవ్వారని, ఇప్పుడు ఆ కాల్వ మల్లన్నసాగర్ లో మునిగిపోయిందని, దీంతో ఆ మొత్తం వృథా అయ్యిందని కాగ్​ తెలిపింది. 
    2019లో గోదావరిలో వరద ఉధృతికి సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో సీసీ బ్లాకులు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి రూ.189.93 కోట్లు వృథా అయ్యాయని, ఆ పనులు చేయడానికి మళ్లీ రూ.476 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని కాగ్ పేర్కొంది. 

కాగ్​ ఏం చెప్పిందంటే?

    కాళేశ్వరం పంపులు, మోటార్ల కొనుగోళ్లలో 
కాంట్రాక్టర్లకు 327శాతం అదనపు చెల్లింపులు జరిపారు.
    కొనుగోళ్లలో రూ.14,501 కోట్ల వరకు 
అక్రమాలు జరిగినట్టు అనుమానం.
    జెన్​కోలో రిటైర్​ అయిన ఇంజనీర్​ వేసిన అంచనాలతోనే ఎస్టిమేట్లు రూపొందించి టెండర్లు పిలిచారు. ఆ ఎస్టిమేట్లకు ఆధారాలేమిటో అప్పటి ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వలేదు. ఒక్కో మోటారు కోసం కాంట్రాక్టర్​కు ప్రభుత్వం రూ.2.57 కోట్లు చెల్లించగా.. సదరు కాంట్రాక్టర్ బీహెచ్ఈఎల్ కు రూ.60 లక్షలు మాత్రమే చెల్లించారు. 
    ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో రీ ఇంజనీరింగ్ చేయడం ద్వారా రూ.767.67 కోట్లు వేస్ట్​ చేశారు.
    కొండపోచమ్మసాగర్  కోసం రూ.74.07 కోట్లతో గ్రావిటీ కెనాల్ తవ్వగా.. ఆ కెనాల్​ మల్లన్నసాగర్​లో మునిగిపోయింది. ఫలితంగా ఆ 74.07 కోట్లు కూడా వృథా అయ్యాయి.
    సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో వరదకు  సీసీ బ్లాకులు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోయి రూ.189.93 కోట్ల నష్టం వాటిల్లింది. వాటి రిపేర్లకు మళ్లీ రూ.476 కోట్లు ఖర్చు చేశారు.
    పవర్ హౌసుల్లో వాడే ఈవోటీ క్రేన్లు, మొబైల్ క్రేన్లు, జనరేటర్లు, బ్యాటరీలు, ట్రాన్స్ ఫార్మర్లు, ఎర్తింగ్ మెటీరియల్ కొనుగోళ్లలోనూ భారీగా అక్రమాలు జరిగాయి. వీటి కోసం రూ.1,282 కోట్లు గంపగుత్తగా చెల్లించారని, ఇందులో 
ఏ పనికి ఏ ప్రాతిపదికన చెల్లించారు.. అనే వివరాలేవీ లేవు. 
    ప్రైస్ అడ్జస్ట్​మెంట్ కింద స్టీల్, సిమెంట్ ధరలలో మార్పుల పేరుతో చేసిన చెల్లింపుల్లోనూ రూ.1,342 కోట్ల అక్రమాలు జరిగాయి.