ముంబై: ఓ వ్యక్తి తమకు పిల్లలు లేరని ఓ బాలికను కిడ్నాప్ చేశాడు. తొమ్మిదేండ్ల తర్వాత ఇంటర్నెట్లో దొరికిన పోస్టర్ ఫొటో ద్వారా ఆ యువతి తిరిగి తన తల్లి వద్దకు చేరింది. ముంబైలోని అంధేరిలో ఈ ఘటన జరిగింది. అంధేరి శివారు ప్రాంతానికి చెందిన పూజ అనే ఏడేండ్ల బాలిక 2013లో సోదరుడితో కలిసి స్కూలుకు వెళ్లింది. స్కూలు వద్ద హెన్రీ జోసెఫ్ డిసౌజా అనే వ్యక్తి ఆ బాలికను మభ్యపెట్టి కిడ్నాప్ చేశాడు. ఆమె పేరు యానీ డిసౌజాగా మార్చి, కర్నాటకలోని ఓ హాస్టల్లో చేర్పించాడు.
కొన్నాళ్లకు జోసెఫ్ దంపతులకు బిడ్డ పుట్టడంతో పూజను ఇంటికి తీసుకొచ్చి పనిమనిషిలా ఉపయోగించుకుంటున్నారు. పూజ ప్రస్తుతం పదహారేండ్ల యువతి. ఆమె తండ్రి కొన్నేండ్ల కిందే చనిపోగా తల్లి, సోదరుడు ఉన్నారు. అయితే, ఓ రోజు మద్యం మత్తులో ఇంటికొచ్చిన జోసెఫ్.. పూజకు అసలు విషయం చెప్పాడు. దీంతో ఫ్రెండ్తో కలిసి ‘‘పూజ మిస్సింగ్’’ అనే పదాలతో ఆమె ఇంటర్నెట్లో వెతికింది. పాత మిస్సింగ్ పోస్టర్ దొరికింది. అందులోని నంబర్కు ఫోన్ చేయగా.. సమాచారం దొరికింది. పోలీసుల సాయంతో పూజ తల్లి వద్దకు చేరింది. జోసెఫ్ దంపతులను అరెస్ట్ చేశారు.