ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 40 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు 77.04 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కంప్లీట్ అయింది. మొత్తం 174 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 11 జిల్లాలు ఉండగా.. సార్చిప్లో రికార్డు స్థాయిలో 83.96 శాతం పోలింగ్ రికార్డయింది. ఖౌజ్వాల్లో 79 శాతం, హనాథియాల్లో 78 శాతం పోలింగ్ నమోదైంది. సయ్యా జిల్లాలో అతి తక్కువగా 53 శాతం, ఐజ్వాల్లో 66 శాతం పోలింగ్ రికార్డయింది. ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు ముగిశాయని మిజోరం అడిషన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ హెచ్ లియాంజెలా ప్రకటించారు. 2018లో 81 శాతం పోలింగ్ నమోదైంది.
సీఎం వచ్చినప్పుడే మోరాయించిన ఈవీఎం
ఐజ్వాల్లోని ఒక పోలింగ్ స్టేషన్లో మాత్రమే ఈవీఎం మోరాయించిందని ఎన్నికల అధికారి వివరించారు. సీఎం జోరంతంగా ఓటేసేందుకు వెళ్లినప్పుడే ఈవీఎం పని చేయలేదన్నారు. పొద్దున సీఎం జోరంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెంగ్లాయి ప్రైమరీ స్కూల్లోని పోలింగ్ స్టేషన్కు వెళ్లారు. అయితే, అక్కడ ఈవీఎం మోరాయించింది. దీంతో ఆయన ఓటు వేయకుండానే ఇంటికెళ్లిపోయారు. ఈవీఎంలో సాంకేతిక సమస్య పరిష్కరించినట్లు అధికారులు చెప్పడంతో 9.40 గంటలకు మళ్లీ పోలింగ్స్టేషన్కు వచ్చి ఓటేశారు. స్టేట్ కాంగ్రెస్ చీఫ్ లాల్సావ్తా తన ఓటు హక్కును ఐజ్వాల్ వెస్ట్ 3 సెగ్మెంట్లోని పోలింగ్ స్టేషన్లో వినియోగించుకున్నారు.
ఎంఎన్ఎఫ్ గెలుపుపై జోరంతంగా ధీమా
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7,200 మంది పోలీసులను మోహరించారు. మిజో నేషనల్ ఫ్రండ్(ఎంఎన్ఎఫ్) అధికారంలోకి వస్తుందని సీఎం జోరంతంగా ధీమా వ్యక్తం చేశారు. పొత్తులతో పనిలేకుండానే ఎంఎన్ఎఫ్ అధికారంలోకి వస్తుందని వివరించారు.