ఓటమి భయంతోనే అనుచిత వ్యాఖ్యలు : సోయం బాపూరావు

ఓటమి భయంతోనే అనుచిత వ్యాఖ్యలు : సోయం బాపూరావు
  •     అనిల్‌ జాదవ్‌పై సోయం బాపూరావు ఫైర్‌

గుడిహత్నూర్, వెలుగు : ఎమ్మెల్యేగా ఉండి కూడా తాను ఏం సంపాదించలేదని.. కానీ రెండు సార్లు ఓడిపోయి కూడా రెండు ఇండ్లు కట్టుకున్న అనిల్‌ జాదవ్‌ తనను దొంగ అని విమర్శించాడని బీజేపీ బోథ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సోయం బాపూరావు ఫైర్‌ అయ్యారు. సోమవారం గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సోయం మాట్లాడారు. ఓటమికి భయపడి తనపై అనిల్​ జాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని హెచ్చరించారు.

అంతకు ముందు గుడిహత్నూర్, డోంగర్‌ గావ్‌లో ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. డోంగర్‌గావ్​లో పలువురు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు, జడ్పీటీసీ పతంగె బ్రహ్మానంద్, నాయకులు సాకటి దశరథ్, సూర్యకాంత్‌ గిత్తే , కేంద్రె లక్ష్మణ్, డా.బాలాజీ, ఆర్యన్‌ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు.