
సుల్తానాబాద్, వెలుగు: గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయడం ప్రారంభమైందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. రూ.2.50 కోట్లతో నిర్మించిన జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సుల్తానాబాద్ బ్రాంచ్ కొత్త భవనాన్ని శుక్రవారం కేడీసీసీబీ జిల్లా అధ్యక్షుడు కొండూరు రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార వ్యవస్థకు, సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సింగిల్ విండోలను అభివృద్ధి పథంలోకి నడిపేందుకు సహకారం అందిస్తున్న పెద్దపల్లి నియోజకవర్గంలోని సహకార సంఘాల కార్యదర్శులను బదిలీ చేయకుండా యథాస్థానంలో ఉంచాలని కోరారు.
సొసైటీలకు సోలార్ ప్రాజెక్టులు
దేశంలో, రాష్ట్రంలో తొలిసారిగా పెద్దపల్లి జిల్లాలోని ప్యాక్స్లకు 4 సోలార్ పవర్ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని కేడీసీసీబీ అధ్యక్షుడు కొండూరు రవీందర్ రావు తెలిపారు. పెద్దపల్లి,మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని సహకార సంఘాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారని, వీటి కోసం 5 ఎకరాల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిందని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో లైబ్రరీ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్, కేడీసీసీబీ డైరెక్టర్లు శ్రీనివాస్, మోహన్ రావు, డీసీవో శ్రీమాల, తదితరులు పాల్గొన్నారు.