అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తా : గడ్డం వినోద్

అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తా  : గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు:  బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని  ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెప్పారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  బెల్లంపల్లి పట్టణంతో పాటు, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు  ప్రజా దర్బార్లు నిర్వహిస్తానని వినోద్ తెలిపారు.  

సమస్యలను సీఎం  దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు. గతంలో బెల్లంపల్లిలో బీఆర్ఎస్  నాయకులు చేసిన భూకబ్జాలపై విజిలెన్స్  విచారణ చేయిస్తానని ప్రకటించారు.  అధికారులతో  త్వరలో సమీక్ష సమావేశం నిర్వహించి నియోజకవర్గ అభివృద్ధిపై రోడ్ మ్యాప్  సిద్ధం చేస్తానని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత,  కార్కూరి రామచందర్,  మత్త మారి సూరిబాబు,  పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, కౌన్సిలర్లు బండి ప్రభాకర్ యాదవ్, భూక్య రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.

పేదలను ఆదుకునే ప్రజా ప్రభుత్వం ఇది

బెల్లంపల్లి, వెలుగు:  రాష్ట్రంలో పేదలను ఆదుకునే ప్రజా ప్రభుత్వం ఏర్పాటయిందని  ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఆదివారం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని  ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ సత్యనారాయణ రెడ్డితో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల కోసం రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా పథకంలో రూ. 10లక్షల వరకు పేదలకు వైద్య ఖర్చులను ప్రభుత్వం అందజేస్తుందన్నారు.

కాగా పట్టణంలోని కాంటా చౌరస్తాలో  ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకాన్ని  జెండా ఊపి ప్రారంభించారు.  ఎమ్మెల్యే బస్సు ఎక్కి మహిళలకు జీరో టికెట్ ఇచ్చి  ఏఎంసీ చౌరస్తా వరకు ప్రయాణించారు.  రాష్ట్ర ప్రభుత్వం  ఆరు గ్యారంటీల్లో  రెండు పథకాలు అమలు పరిచిందన్నారు. మిగతా నాలుగు గ్యారంటీలు వంద రోజుల్లో పూర్తిస్థాయిలో అమలుపరుస్తామన్నారు.

కార్యక్రమాల్లో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్  డాక్టర్  రవికుమార్, కేవీ ప్రతాప్,  ముచ్చర్ల మల్లయ్య,  మత్తమారి సూరిబాబు,  కారుకూరి రాంచందర్,  చిలుముల శంకర్,  మునిమంద రమేశ్, పోచంపల్లి హరీశ్​, కౌన్సిలర్లు సూరం సంగీత, ప్రభాకర్ యాదవ్,   డాక్టర్ బత్తుల రవి,  డిపో మేనేజర్ రవీంద్రనాథ్, వైద్యులు   తదితరులు పాల్గొన్నారు.