జడ్చర్ల, వెలుగు: మున్సిపల్ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యకుంటే పేదలని కూడా చూడబోమని, ఎవరికీ ఇండ్లివ్వబోమని బేడ బుడగజంగాలను అధికార పార్టీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బెదిరించారు. శనివారం ఉదయం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని బాదేపల్లి 4వ వార్డులో ఉన్న బేడబుడగజంగాల కాలనీలో ఆ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శంకర్, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాదిమి శివకుమార్తో కలిసి లక్ష్మారెడ్డి ప్రచారం చేశారు.
బేడ బుడగ జంగాల ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి శంకర్ను గెలిపించాలని ఆయన కోరారు. ప్రస్తుతం 80 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్నామని, ఓట్లలో తేడాకొట్టి టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆ ఇండ్లు ఇవ్వబోమని హెచ్చరించారు. కాలనీలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలను చేపడతామన్నారు. పట్టణంలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్కు ఓటేయాలన్నారు. వేరే పార్టీలకు ఓటేస్తే ఒరిగేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఏ పనులూ కావని, సమస్యల పరిష్కారం జరగదని అన్నారు. కాబట్టి ఓటర్లంతా ఆలోచించుకుని టీఆర్ఎస్కు ఓట్లేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని డిమాండ్ చేశారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని మొత్తం 27 కౌన్సిలర్ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే గెలుచుకుంటుందని లక్ష్మారెడ్డి అన్నారు.