
- కేసీఆర్ కు కూతురైనా, కార్యకర్తైనా పార్టీలో సమానమే
- మోదీ, రేవంత్, బాబు కుట్రలో భాగంగానే సీబీఐకి అనుమతి
- కేసీఆర్ ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండమే
- జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కామెంట్స్
జనగామ, వెలుగు : బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన జనగామలో పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని హాట్ కామెంట్స్చేశారు. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఎంతటి వారిపైనైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ కు బిడ్డైనా, కార్యకర్తైనా సమానమేనన్నారు. అందుకే తన బిడ్డ అని కూడా చూడకుండా కవితను సస్పెండ్ చేశారన్నారు. తెలంగాణ సాధించి పెట్టిన కేసీఆర్పై సీబీఐని ఎగదోస్తూ అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ శ్రేణులంతా ఆవేదనకు గురవుతుంటే, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా కవిత మరింత నష్టం కలిగించేలా మాట్లాడడం శోచనీయమన్నారు.
పార్టీ కీలక నేతలను కించపరిచి ఇబ్బంది పెట్టేలా వ్యవహరించినందునే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నిర్ణయాన్ని కార్తకర్తలంతా ముక్తకంఠంతో స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సీబీఐ అనుమతిలో ప్రధాని మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డిల కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలించేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ సర్కారే వస్తుందన్నారు. ఈ సమావేశంలోపార్టీ లీడర్లు పోకల జమున, బాల్దె సిద్ధిలింగం, గాడిపల్లి ప్రేమలతా రెడ్డి, గద్దల నర్సింగారావు, బండ పద్మ యాదగిరి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.