
మాదాపూర్, వెలుగు: నా వాహనాన్నే ఆపుతావా ? నేనెవరో తెలుసా అంటూ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ను తిడుతూ దాడి చేశాడు ఓ ఎమ్మెల్యే కొడుకు మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం…సోమవారం సాయంత్రం మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్రెడ్డి ఖానామేట్ చౌరస్తాలో డ్యూటీ చేస్తున్నాడు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడం, వన్వే ఉండడం తో 6.30 గంటల సమయంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జగ్గయ్యపేట్ ఎమ్మెల్యే సామినేని ఉదయ్భాను కుమారుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ తన కారులో హైటెక్స్ నుండి కొండాపూర్ వైపు వెళ్తున్నాడు. కారు ఖానామేట్ వద్దకు చేరుకోగానే ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్రెడ్డి కారును నిలిపి వేసి వన్వే కాబట్టి వెళ్లవద్దని చెప్పారు. దీంతో ప్రసాద్ కారు దిగి తాను ఎవరో తెలుసా? ఎవరి కారును ఆపావో తెలుసా అంటూ ఇన్స్పెక్టర్ను దూషిస్తూ పైపైకి వచ్చాడు. దీంతో ఇన్స్పెక్టర్ రాజ్గోపాల్రెడ్డి ‘మీరు ఎవరైనా రూల్స్ అందరికీ ఒకేటా ఉంటాయ్’ అని చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రసాద్ నాకే రూల్స్ చెప్తావా అంటూ ఇన్స్పెక్టర్ను బూటు కాలితో తన్నాడు. దీంతో రాజ్గోపాల్ రెడ్డి గాయపడ్డాడు. వెంటనే ఆయన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఏ. శ్రీనివాస్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ఎమ్మెల్యే కుమారుడు వెంకటకృష్ణ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.