విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీలు చెల్లించాలి : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

విద్యార్థులకు కాస్మొటిక్ ఛార్జీలు చెల్లించాలి :  ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి

నర్సాపూర్, వెలుగు: విద్యార్థులకు తక్షణమే కాస్మొటిక్ చార్జీలను చెల్లించాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గ స్థాయి ప్రభుత్వ హాస్టల్‌‌‌‌ అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డెన్లు వారి హాస్టల్ లో గల సమస్యలను, ఇబ్బందులను ఎమ్మెల్యే ముందు ఏకరువు పెట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హాస్టల్లో అన్ని సదుపాయాలు సక్రమంగా ఉంటేనే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను అందించాలని వార్డెన్లకు సూచించారు. 

కిచెన్​లో మెనూకు సంబంధించిన చాట్ ను ఏర్పాటు చేయాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందివ్వాలని ఆదేశించారు. హాస్టల్లో డ్రైనేజ్, కాంపౌండ్ సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని హాస్టల్లో మిషన్ భగీరథ కనెక్షన్ లేదని వాటిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇక మీదట ప్రతి హాస్టల్‌‌‌‌ను సందర్శిస్తానని, హాస్టల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో నీలిమ, గంగ కిషన్, అమర జ్యోతి, తారా సింగ్, బుచ్చ నాయక్, లింగేశ్వర్ పాల్గొన్నారు.