జిల్లాల్లో కొవిడ్ సెంటర్లకు ఎమ్మెల్యేలు, ఎంపీల క్యూ
గాంధీ దవాఖానకు కేసీఆర్ వెళ్లడంతో లీడర్లలో కదలిక
ఏడాదిగా కొవిడ్ సెంటర్ల దిక్కు చూడని నేతలు
(వెలుగు, నెట్వర్క్):‘‘సరిపడా ఆక్సిజన్ లేదు.. వెంటిలేటర్లు, రెమ్డిసివిర్ ఇంజక్షన్లు దొరుకుతలేవు.. చస్తున్నాం.. కాపాడండి.. ’’ అంటూ ఇన్నాళ్లూ జనం మొత్తుకున్నా కదలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు గురువారం పలు జిల్లాల్లోని కొవిడ్ సెంటర్లకు క్యూ కట్టారు. పేషెంట్లను పేరుపేరునా పలకరిస్తూ.. ‘ట్రీట్మెంట్ మంచిగున్నదా? రోజూ డాక్టర్ వచ్చి చూస్తుండా? మందులు సక్కగిస్తున్నరా? భోజనం మంచిగ పెడుతున్నరా?’ అని అడిగి తెలుసుకున్నారు. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడే లీడర్లు రావడం వెనుక కథ వేరే ఉన్నదనే టాక్ వినిపిస్తోంది. బుధవారం గాంధీ హాస్పిటల్లోని కొవిడ్ వార్డును సీఎం కేసీఆర్ విజిట్ చేసి పేషెంట్ల బాగోగులు
అర్సుకున్నరు కదా, అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కరోనా పేషెంట్ల దారి పట్టారనే చర్చ జరుగుతోంది. ఈ పని ఎప్పుడో చేసి ఉంటే హాస్పిటళ్లలో కొన్ని సమస్యలైనా పరిష్కారమయ్యేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇన్నాళ్లూ పట్టించుకునే దిక్కు లేదు
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రవేశించి ఏడాది దాటింది. ఫస్ట్, సెకండ్ వేవ్లలో కలిపి దాదాపు ఐదున్నర లక్షల మంది కరోనా బారినపడ్డారు. అధికారిక లెక్కల ప్రకారమే 3 వేల మందికి పైగా చనిపోయారు. ప్రస్తుత సెకండ్వేవ్ మరీ భీకరంగా ఉంది. ఆస్పత్రులన్నీ కొవిడ్ కేర్ సెంటర్లుగా
మారిపోయాయి.
కొద్ది నెలలుగా సరిపడా ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమ్డిసివిర్ ఇంజక్షన్లు దొరక్క పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరైతే తమను కాపాడుమంటూ వీడియోలు తీసి సోషల్మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే సీఎం గానీ, మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ కొవిడ్ సెంటర్లను సందర్శించలేదు. సీఎంతో పాటు మంత్రులు కూడా ‘అంతా బాగుంది..’ అంటూ మాట్లాడారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు రావడంతో సీఎం కేసీఆర్ బుధవారం గాంధీ హాస్పిటల్ను విజిట్ చేసి కరోనా పేషెంట్ల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇక అంతే.. తెల్లవారిందో లేదో పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కొవిడ్సెంటర్లకు క్యూ కట్టారు.
పేషెంట్లకు పలకరింపులు.. సమస్యలపై ఆరా
ఆర్థిక మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్ జిల్లా ప్రభుత్వాస్పత్రిని గురువారం సందర్శించి, అక్కడి కొవిడ్ వార్డులో ట్రీట్మెంట్ పొందుతున్నవాళ్లను పరామర్శించారు. రోజూ డాక్టర్ఎన్నిసార్లు వచ్చి చెక్ చేస్తున్నారు? ఏమైనా సమస్యలున్నాయా? అని ఆరా తీశారు. పేషెంట్లను పేరు పేరునా పలకరించారు. వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి కల్వకుర్తి, నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కొవిడ్ ఐసోలేషన్ సెంటర్లను విజిట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ట్రీట్మెంట్ పొందుతున్న పేషెంట్లతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండల కేంద్రాల్లోని పీహెచ్సీలు, కొవిడ్ ఐసోలేషన్ సెంటర్లను స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. పేషెంట్లకు పండ్లను అందజేశారు. ఆర్అండ్బీ, హౌసింగ్ మినిస్టర్ వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ కామారెడ్డి జిల్లా హాస్పిటల్లోని కొవిడ్వార్డులో పర్యటించారు.
బెల్లంపల్లి ఐసోలేషన్ వార్డుకు ముగ్గురు ఎమ్మెల్యేలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కరోనా ఐసోలేషన్ వార్డులో ఈ నెల 5,6 తేదీల్లో 12 మంది, 7, 8 తేదీల్లో ఆరుగురు.. మొత్తంగా నాలుగు రోజుల వ్యవధిలో 18 మంది చనిపోయారు. అప్పట్లో మీడియాలో ఈ వార్తలు ప్రముఖంగా వచ్చినప్పటికీ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలుగానీ, ఎంపీగానీ, ఇతర ప్రజాప్రతినిధులెవరూ కొవిడ్సెంటర్ను సందర్శించలేదు. అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తీరా బుధవారం సీఎం కేసీఆర్ గాంధీ హాస్పిటల్ను విజిట్ చేయడంతో గురువారం మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, కలెక్టర్ భారతి హోళికేరితో కలిసి బెల్లంపల్లి కొవిడ్ ఐసోలేషన్ వార్డును విజిట్ చేశారు. కాగా, ఎమ్మెల్యేలు అరగంట పాటు హడావుడి చేసి వెళ్లిపోయారని, అసలు సమస్యలను పట్టించుకోలేదని పేషెంట్ల బంధువులు ఆరోపించారు.