
- హైకోర్టులో ఎమ్మెల్యేస్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేస్ కాలనీలోని రీక్రియేషన్ సెంటర్లో 13 కార్డుల రమ్మీ, సిండికేట్ గేమ్స్ ఆడేందుకు పోలీసులు అను మతి ఇవ్వడం లేదని కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ కార్యదర్శి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారించి పోలీసులకు, రాష్ట్ర ప్రభు త్వానికి నోటీసులు ఇచ్చింది.
13 కార్డుల రమ్మీ, సిండికేట్ గేమ్స్ను అనుమతించకపోవడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. తెలంగాణ గేమింగ్ చట్టానికీ వ్యతిరేకమన్నారు. సొసైటీలో 1,020 మంది సభ్యులున్నారని, వీరిలో ఎక్కువగా మాజీ/ ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రిటైర్డు జడ్జీలు, ప్రొఫెసర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, బిల్డర్లు, వ్యాపారులు ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో రమ్మీ, సిండికేట్ గేమ్స్ ఆడేందుకు అనుమతిచ్చేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అనంతరం జడ్జి.. సీఎస్, హోం, న్యాయశాఖల ముఖ్యకార్యదర్శులు, డీజీపీ, సిటీ పోలీసు కమిషనర్లకు నోటీసులు జారీ చేశారు.