![కేసీఆర్పై రేవంత్ నిలబడితే కాంగ్రెస్ గెలిచే మొదటిస్థానం కామారెడ్డినే : జీవన్రెడ్డి](https://static.v6velugu.com/uploads/2023/10/mlc-jeevan-reddy-said-that-if-revanth-reddy-contests-against-kcr-in-kamareddy-the-first-place-congress-will-win-in-the-state-is-kamareddy_gJnD1bwi8M.jpg)
కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్ గా మారుతోందని గతంలో తాము చెప్పినట్లే నిజమైందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గోదావరి వరద ప్రవాహం వస్తే ఇసుక తరలిపోతుందనే పరిజ్ఞానం ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని మండిపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కింద బొగ్గు గనులు ఉన్నాయని కేసీఆర్ కు తెలియదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ సంతకాలు పెట్టమంటే ఇంజనీరింగ్ ఆఫీసర్లు పెట్టారని ఆరోపించారు. సాంకేతికంగా పరిశీలించకుండా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినందుకు ఈఎన్సీ మురళీధర్ రావును జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీకి నిలబడితే రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొట్ట మొదటి స్థానం కామారెడ్డి అని చెప్పారు. కేసీఆర్ ను ఓడగొట్టే మొగోడు రేవంత్ రెడ్డి అని, ముఖ్యమంత్రిని ఓడగొట్టాలని ప్రజలందరూ కసితో ఉన్నారని చెప్పారు. కామారెడ్డి ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందన్నారు. జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.