
రియల్ మనీ ఆన్లైన్ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్ఫారమ్ మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL) ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సుమారు 350 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సంస్థలో దాదాపు 50% మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. ఈ తొలగింపులకు కారణం జీఎస్టీలో మార్పులు తీసుకురావడమేనని కంపెనీ సహ వ్యవస్థాపకుడు సాయి శ్రీనివాస్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని వివరించారు. ఈ సందర్భంగా కంపెనీ.. స్టాఫ్ అందరికీ మెయిల్స్ పంపింది.
ఇటీవల గేమింగ్ రెవెన్యూపై కేంద్రం ఇటీవల ప్రకటించిన ప్రకారం 28% పన్ను విధించబడుతుంది. ఇది MPL పై 350%-400% పన్ను భారాన్ని పెంచుతుందని ఈ సందర్భంగా కంపెనీ కో- ఫౌండర్ తెలిపారు. "డిజిటల్ కంపెనీగా, మా వేరియబుల్ ఖర్చులు ప్రధానంగా వ్యక్తులు, సర్వర్, కార్యాలయ మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి. అందువల్ల మన వ్యాపారం మనుగడ సాగించడానికి, ఈ ఖర్చులను తగ్గించడానికి మేము చర్యలు తీసుకోవాలి" అని ఆయన మెయిల్ లో తెలిపారు. "మేము ఇప్పటికే మా సర్వర్, ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులను పునఃపరిశీలించే పనిని ప్రారంభించాం. అయినప్పటికీ, మేము మా ఉద్యోగులకు సంబంధించిన ఖర్చులను ఇంకా తగ్గించుకోవాలి. అందుకే మేము మీలో దాదాపు 350 మందిని తొలగించక తప్పదు" అని శ్రీనివాస్ జోడించారు.