ఇకనుంచి ఏటీఎంలలో కూడా ఎయిర్టెల్ రీఛార్జ్
ఏటీఎంలు, ఫార్మసీలు, గ్రోసరీ స్టోర్లలో అందుబాటులోకి తెచ్చిన కంపెనీ
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ కస్టమర్లు తమ మొబైల్ను రీఛార్జ్ చేసుకునేందుకు కంపెనీ అనేక మార్గాలు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో బ్యాంకు ఏటీఎంలు, ఫార్మసీలు, గ్రోసరీ స్టోర్లలో ఎయిర్టెల్ వినియోగదారులు తమ మొబైల్ఫోన్లను రీఛార్జ్ చేసుకోవచ్చని భారతీ ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. దేశంలో చాలామందికి ఆన్లైన్లోరీఛార్జ్ చేసుకునే వెసులుబాటు లేదన్న సంగతి తమకు
తెలుసని అలాగే, ప్రస్తుత లాక్డౌన్ సమయంలో రీఛార్జ్ చేసుకునే అవకాశం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో పలు బ్యాంకుల ఏటీఎంలు,
ఫార్మసీలు, గ్రోసరీ స్టోర్లలో రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు తెలిపారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, అపోలో, బిగ్బజార్లలో రీఛార్జ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉన్నట్టు గోపాల్ తెలిపారు.
35 శాతం తగ్గిన మొబైల్ రీఛార్జ్లు
దేశవ్యాప్తంగా లాక్డౌన్ వల్ల పేదలూ, వ్యవసాయ, వలస కూలీలు ఉపాధికే కాదు కమ్యూనికేషన్కూ దూరమవుతున్నారు. మనదేశంలో ఫీచర్/
బేసిక్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించేది వలస కూలీలు/గ్రామీణ ప్రాంతాలవారనే విషయం తెలిసిందే. గత 12 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో వీళ్లు తమ ఫోన్లను రీఛార్జ్ చేయించుకోలేకపోతున్నారు. రీఛార్జ్ షాపులన్నీ మూతబడ్డాయి. టెలికం ఆపరేటర్లూ పనిచేయడం లేదు. ఆన్లైన్ రీఛార్జ్ చేయించుకోవాలని ఇవి చెబుతున్నాయి. కనీసం కిరాణా దుకాణాల్లోనూ ఈ సదుపాయం అందుబాటులోకి రావడం లేదు. కంపెనీల నుంచి తమకు రీఛార్జ్ బ్యాలన్స్ రావడం లేదని షాపుల యజమానులు చెబుతున్నారు. మనదేశంలో దాదాపు 37 కోట్ల ఫీచర్ ఫోన్లు ఉంటాయి. ఇందులో జియో 4జీ ఫోన్ల సంఖ్య తొమ్మిది కోట్ల వరకు ఉంటుంది. వీటిలో అత్యధికంగా ఉపయోగించేది వలస కూలీలు, పేదవాళ్లే. మనదేశంలోని 115 కోట్ల ఫోన్లలో 90 శాతం ఫోన్లు ప్రీపెయిడ్వే! అయితే వలస కూలీలకు రీఛార్జులు అందుబాటులో లేనందున వ్యాలిడిటీని
ఈ నెల 17 వరకు పెంచుతామని దాదాపు అన్నిటెల్కోలు ప్రకటించాయి. ఇప్పుడు ఆన్లైన్ రీఛార్జ్ తప్ప వోచర్ రీఛార్జ్ దాదాపు ఎక్కడా లేదని ఇవి చెబుతున్నాయి. దీంతో తమ ఆదాయాలు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నాయి. మనదేశంలోని మూడు పెద్దటెల్కోలు దాదాపు రూ.15 కోట్లు నష్టపోతాయని అంచనా. లాక్డౌన్ ఈ నెల 14 తర్వాత కూడా కొనసాగితే భారీగా నష్టపోతామని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.
For More News..