ఇమ్రాన్​కు థాంక్స్​.. ఇండియా సెంటిమెంట్లను అర్థం చేసుకున్నారు: మోడీ

ఇమ్రాన్​కు థాంక్స్​.. ఇండియా సెంటిమెంట్లను అర్థం చేసుకున్నారు: మోడీ

కర్తార్​పూర్​ కారిడార్​ ప్రారంభమైంది. మన పంజాబ్​లోని డేరా బాబా నానక్​ గుడితో పాకిస్థాన్​లోని గురుద్వారా దర్బార్​ సాహిబ్​ను  కలిపే కారిడార్​ డోర్లు శనివారం తెరుచుకున్నాయి. ఇటుపక్క ప్రధాని నరేంద్ర మోడీ, అటు పక్క పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అధికారికంగా ప్రారంభించారు. మోడీ జెండా ఊపి మొదటి బ్యాచ్​ టూరిస్టులను అక్కడికి పంపితే, హాట్​ ఎయిర్​ బెలూన్లతో కర్టెన్లను పైకి లాగి కారిడార్​ను ఇమ్రాన్​ ఖాన్​ ప్రారంభించారు. ఇమ్రాన్​కు మోడీ థాంక్స్​ చెబితే, ఇమ్రాన్​ ఖానేమో కాశ్మీర్​ అంశాన్ని లేవనెత్తి విమర్శలు చేశారు.

 

    కర్తార్​పూర్​ కారిడార్​పై  ప్రధాని మోడీ

  జెండా ఊపి టూరిస్టులను పంపిన ప్రధాని

“పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు థాంక్స్​. కర్తార్​పూర్​ కారిడార్​పై ఇండియా ఫీలింగ్స్​ను ఆయన అర్థం చేసుకున్నారు. గౌరవం ఇచ్చారు. కారిడార్​ తొందరగా పూర్తయ్యేందుకు సహకరించిన పాకిస్థాన్​ వర్కర్లకూ నా థాంక్స్​” ఇదీ కర్తార్​పూర్​ కారిడార్​ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాటలు. శనివారం పంజాబ్​లోని డేరా బాబా నానక్​ దగ్గర 500 మందికి పైగా సిక్కు టూరిస్టులను జెండా ఊపి కారిడార్​లోకి పంపించారు. తర్వాత అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని శిఖార్​ మసియాన్​లోని బీఎస్​ఎఫ్​ క్యాంపులో మాట్లాడారు. కేవలం సిక్కులకే కాకుండా మానవాళి మొత్తానికి స్ఫూర్తి నింపిన గొప్ప వ్యక్తి గురు నానక్​ దేవ్​ అని ఆయన కొనియాడారు. నవంబర్​ 12న గురు నానక్​ 550 జయంతి ఉత్సవాలు జరగడానికి కొన్ని రోజుల ముందే కారిడార్​ను ఓపెన్​ చేయడం సంతోషంగా ఉందన్నారు. కారిడార్​ను జాతికి అంకితం ఇచ్చారు. ఈ కారిడార్​తో గురుద్వారా దర్బార్​ సాహిబ్​లో గురునానక్​ను దర్శించుకోవడం మరింత సులభమవుతుందన్నారు. ఇంతటి పవిత్రమైన నేలపై అడుగుపెట్టినందుకు తనకు ఆనందంగా ఉందని, మీరందరూ కరసేవ చేసేటప్పుడు ఎలాంటి ఆనందం పొందుతారో తనకూ అలాగే ఉందని అన్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్​ కమిటీ (ఎస్​జీపీసీ) ఇచ్చిన కౌమి సేవ అవార్డును గురు నానక్​దేవ్​కే అంకితమిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమానికి పంజాబ్​ గవర్నర్​ వీపీ సింగ్​ బద్నోరే, సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​, కేంద్ర మంత్రి హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​, ఎస్​జీపీసీ చీఫ్​ గోవింద్​ సింగ్​ లోంగోవాల్​ హాజరయ్యారు.

మళ్లీ ఇమ్రాన్​ కాశ్మీర్​ పాట

అది భూవివాదం కాదు..
మానవ సంక్షోభం
కర్తార్​పూర్​ కారిడార్​ ప్రారంభంలో ఇమ్రాన్​

కర్తార్పూర్ (పాక్):

‘‘కాశ్మీరీలను జంతువుల్లా చూస్తున్నారు. కాశ్మీర్​ కేవలం భూవివాదమే కాదు. అదో మానవ సంక్షోభం. 9 లక్షల మంది సైనికులను పెట్టి హక్కులను కాలరాస్తున్నారు” ఇదీ కర్తార్​పూర్​ కారిడార్​ ప్రారంభోత్సవం సందర్భంగా మన దేశంపై పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ చేసిన విమర్శలు. శనివారం ఆయన పాకిస్థాన్​లోని కర్తార్​పూర్​లో ఉన్న గురుద్వారా దర్బార్​ సాహిబ్​ కారిడార్​ను ప్రారంభించారు. హాట్​ ఎయిర్​ బెలూన్లతో కర్టెన్లను పైకి లేపి కారిడార్​ను తెరిచారు. ఈ కార్యక్రమానికి మన మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​తో పాటు పంజాబ్​ మాజీ మంత్రి నవజోత్​సింగ్​ సిద్దూ హాజరయ్యారు. ఇండియా నుంచి వచ్చిన మొదటి బ్యాచ్​ టూరిస్టులకు ఇమ్రాన్​ స్వాగతం పలికారు. ‘‘కర్తార్​పూర్​కు ఉన్న ప్రాధాన్యమేంటో నాకు నిజంగా తెలియదు. ఓ ఏడాది కింద మాత్రమే నాకు దీని గురించి తెలిసింది. మీ కోసం ఈ కారిడార్​ను ప్రారంభించడం సంతోషంగా ఉంది” అని అన్నారు. కాశ్మీర్​ అంశాన్ని లేవనెత్తారు. ఆర్టికల్​ 370 రద్దు చేయడాన్ని, కాశ్మీర్​ ప్రజలకు కమ్యూనికేషన్​ కట్​ చేయడాన్ని తప్పుబట్టిన ఆయన, కాశ్మీరీలకు న్యాయం జరగాలని అన్నారు. ‘‘కాశ్మీర్​ సమస్యలో ఇండియా, పాకిస్థాన్​ మధ్య 70 ఏళ్లుగా ద్వేషం రగులుతూనే ఉంది. కాశ్మీర్​ సమస్యను పరిష్కరించుకుంటే రెండు దేశాలు సంతోషంగా ఉంటాయి. ఒకరికొకరం సహకరించుకుంటూ అభివృద్ధి చెందొచ్చు” అని ఇమ్రాన్​ ఖాన్​ అన్నారు. రెండు దేశాల మధ్య అతి త్వరలోనే సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నానన్నారు. కారిడార్​ను ఓపెన్​ చేయడం ప్రేమ, శాంతికి సంకేతంగా నిలుస్తాయని పాక్​ మత వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్​ హఖ్​ ఖాద్రి అన్నారు. ‘‘బెర్లిన్​ గోడను కూల్చ గలిగారు. కర్తార్​పూర్​ కారిడార్​ను ఓపెన్​ చేశాం. మరి, లైన్​ ఆఫ్​ కంట్రోల్​నూ పూర్తిగా చెరిపేయలేమా? దాన్ని కూడా చెరిపేసేయొచ్చు” అని పాక్​ విదేశాంగ మంత్రి షా మహ్మూద్​ ఖురేషి అన్నారు. కాగా, మనసులు గెలుచుకున్నావ్​ అంటూ ఇమ్రాన్​ ఖాన్​ను సిద్దూ మెచ్చుకున్నారు. కాగా, కర్తార్​పూర్​ కారిడార్​ ప్రారంభంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మన్మోహన్​ సింగ్​ అన్నారు.  కారిడార్​ను ప్రారంభించి ఇమ్రాన్​ చరిత్ర సృష్టించారని నవ్​జోత్​ సింగ్​ సిద్దూ అన్నారు. అలెగ్జాండర్​ భయపెట్టి ప్రపంచాన్ని గెలిస్తే, ఇమ్రాన్​ మనసుతో గెలిచారని కొనియాడారు.