ఎకానమీకి డ్యామేజీ
సర్కారు బ్యాంకులకు రూ.70 వేల కోట్లు
స్టార్టప్లకు ఏంజెల్ ట్యాక్స్ రద్దు
హెచ్ఎఫ్సీలకు అదనంగా రూ.20 వేల కోట్లు
ఇలా మాంద్యం
నో బిజినెస్.. ఏ వ్యాపారిని కదిపినా ఇదే కథ. ఏ ఉద్యోగిని కదిపినా ఇదే బాధ. మార్కెట్లో లిక్విడిటీ మాయమైంది. నగదున్నోళ్లు దాచుకుంటున్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు క్యాష్కు కటకటలా డుతున్నాయి. బిజినెస్ లావాదేవీలు తగ్గిపోయి షోరూమ్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. మార్కెట్ను ఆర్థిక మాంద్యం కమ్ముకుంటున్నది. ఆటో మొబైల్ కంపెనీలు, చిన్న పరిశ్రమలు, లగ్జరీ వస్తువులు అమ్మే షోరూమ్లు, మీడియా, ఐటీ, రియల్టీ సహా పలు రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత మొదలైంది.
పారిశ్రామిక రంగం కుదేలు
పారిశ్రామిక రంగ వృద్ధి 2018–-19లో 3.6 శాతానికి పడిపోయింది. జీఎస్టీ, నోట్ల రద్దు ఎఫెక్ట్తో చిన్న, మధ్య తరహా కంపెనీలు ఇంకా కోలుకోలేదు. 30% కంపెనీలు మూతపడగా మిగతావి ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. పెద్ద కంపెనీలకు కూడా అప్పు పుట్టడం లేదు.
రిటైల్ రంగం వెలవెల
రిటైల్ మార్కెట్లో ఉద్యోగాలు పోతున్నాయి. టీ, కాఫీ, బిస్కెట్, టూత్ పేస్టు, సబ్బులు లాంటి వస్తువులపై మాంద్యం ప్రభావం ఉందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెప్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉత్పత్తుల తయారీని నియంత్రిస్తుంటే మరికొన్ని ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
ఆటోమొబైల్లో భారీగా ఉద్యోగాల కోత
ఆటో మొబైల్ రంగం ఏడాదిగా తీవ్రమైన కుదుపులను ఎదుర్కొంటున్నది. అన్ని రకాల వాహనాల అమ్మకాలు పడిపోయాయి. మూడు నెలల్లో 15,000 మంది ఉద్యోగులను తొలగించారు. వాహనాల అమ్మకాలు తగ్గిపోవటంతో 300 షోరూంలను మూసివేశారు. దీంతో 2 లక్షల ఉద్యోగాలు పోయాయి.
కుప్పకూలిన సెన్సెక్స్
నెల రోజుల్లో స్టాక్ ఎక్సేంజ్లో మదుపర్ల సంపద రూ.15 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్వెస్టర్లు బాగా నష్టపోయారు. లక్షల కోట్ల రూపాయల మేర మార్కెట్లో ఇరుక్కుపోయాయి. ఫారిన్ ఇన్వెస్టర్లు జులైలోనే రూ.16 వేల కోట్లను ఉపసంహరించుకున్నారు.
ఇదీ మందు..
దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం భారీ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. ఎకనామిస్టులు, వ్యాపారులు, ఇండస్ట్రియలిస్టులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను తీర్చడానికి, ఉద్యోగాలు ఊడిపోతాయన్న ఆందోళనలో ఉన్న సామాన్యులకు భరోసా కల్పించడానికి.. తాము చేపడుతున్న చర్యలను వెల్లడించారు. దాదాపు మినీ బడ్జెట్ స్థాయిలో ఆర్థిక మంత్రి ప్రకటించిన యాక్షన్ ప్లాన్లోని ముఖ్యాంశాలు..
బ్యాంకులకు 70 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారు.
దీంతో కనీసం రూ. 5 లక్షల కోట్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తాయి. ఇంత భారీ మొత్తం సిస్టమ్లో అందుబాటులోకి వస్తే పరిశ్రమలకు, వ్యాపారాలకు చౌక వడ్డీరేట్లతో అందజేయడానికి బ్యాంకులకు ఈజీ అవుతుంది. ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది.
రిటైల్ వ్యాపారులకు జీఎస్టీ విషయంలో
చికాకులు లేకుండా పలు చర్యలు తీసుకున్నారు. స్టార్టప్లు, కొత్త కంపెనీలపై ఏంజెల్ టాక్స్ కూడా ఉపసంహరించారు. ఇది వ్యాపారులకు పెద్ద ఊరట. సీఎస్ఆర్ విషయంలో కఠిన చర్యలకు కూడా స్వస్తి చెప్పారు. తాజా చర్యలతో రిటైల్ రంగంలో అమ్మకాలు మళ్లీ పుంజుకుంటాయి.
పెట్రోల్, డీజిల్ బండ్లను డిస్కరేజ్ చేసే చర్యలను..
..విత్డ్రా చేసుకున్నారు. 2020 మార్చి కంటే ముందు కొన్న బీఎస్ 4 వెహికిల్స్ను రిజిస్టరైన ఫుల్ పీరియడ్ నడిపించుకోవచ్చు. కొత్త కార్లు కొనకుండా సర్కారు శాఖలపై ఉన్న నిషేధం కూడా ఎత్తేశారు. ఇప్పటికే కూలబడ్డ ఆటోమొబైల్ రంగానికి ఇది హుషారునిస్తుంది.
విదేశీ ఇన్వెస్టర్లు, సూపర్ రిచ్ల ఆదాయంపై
పెంచిన సర్ చార్జ్ విత్డ్రా చేశారు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కాపిటల్ గెయిన్స్ టాక్స్ కూడా వెనక్కి తీసుకున్నారు. ఈ పన్నుల వల్ల ఫారిన్ ఇన్వెస్టర్లు షేర్లు అమ్ముకొని వెళ్లిపోతున్నరు. ఇప్పుడిక వాళ్లకు భరోసా లభిస్తుంది. స్టాక్మార్కెట్లకు ఇది జోష్ను ఇచ్చే అవకాశం ఉంది.
ఇండియా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందన్న ఆందోళనల నడుమ ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర ఆర్థికశాఖ కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీలకు ఆర్థికసాయం చేస్తామని వెల్లడించింది. పన్ను విధానాలు ట్యాక్స్పేయర్లకు మరింత అనువుగా ఉండేలా చూస్తామని తెలిపింది. స్టార్టప్లకు పన్ను ఇబ్బందులను తొలగించినట్టు ప్రకటించింది. గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తోందని మూడీఎస్ రేటింగ్ ఏజెన్సీతోపాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఆందోళన వ్యక్తం చేసిన కాసేపటికే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వివిధ రంగాలను ఆదుకోవడానికి ప్రోత్సాహకాలను ప్రకటించారు.
సంపద సృష్టించే వారిని ప్రోత్సహిస్తాం. మరిన్ని సంస్కరణలను తీసుకొస్తాం. అమెరికా, చైనాతో పోలిస్తే మన ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ఇండియా వేగంగా వృద్ధిరేటు నమోదు చేస్తున్నది. బ్యాంకులను, ఎన్బీఎఫ్సీలను మరింత ఆదుకుంటాం. ఇవి మరిన్ని అప్పులు ఇచ్చేలా ప్రోత్సాహకాలు ఇస్తాం. ట్యాక్స్ పేయర్లను అకారణంగా ఇబ్బందిపెట్టం. ప్రాసిక్యూషన్ కంటే జరిమానాకే ప్రాధాన్యం ఇస్తాం. – -నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి
బ్యాంకులను, స్టాక్ మార్కెట్లను, స్థిరాస్తుల రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి కేంద్రం పలు చర్యలను ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థికస్థితిని మెరుగుపర్చి, రుణసామర్థ్యం పెంచడానికి వాటికి రూ.70 వేల కోట్లు అందజేస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. దీనివల్ల మార్కెట్కు రూ.ఐదు లక్షల కోట్ల లిక్విడిటీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఫ్యూచర్ జీఎస్టీ పరిహారాలను రెండు నెలల్లోపు చెల్లిస్తామని తెలిపారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్ఎఫ్సీలు) లిక్విడిటీ సపోర్ట్ రూ.30 వేల కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి రెపోరేట్లను అనుగుణంగా అన్ని బ్యాంకులు లోన్ల రేట్లను మార్చుతాయని చెప్పారు.
ఎఫ్పీఐలపై అదనపు సర్చార్జ్ రద్దు
ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) షార్ట్టైమ్ క్యాపిటల్ గెయిన్స్పై అదనపు సర్చార్జ్ రద్దు చేశారు.
ఈ విషయంలో బడ్జెట్కు ముందు ఉన్న స్థితినే కొనసాగిస్తారు. అత్యంత సంపన్నుల కేటగిరీలోకి వచ్చే ఎఫ్పీఐలపై సర్చార్జ్ విధిస్తామని బడ్జెట్లో నిర్మల ప్రకటించడం తెలిసిందే. దీంతో ఎఫ్పీఐలు ఇప్పటి వరకు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.23 వేల కోట్లను వెనక్కి తీసుకున్నారు.
వాహనరంగం అభివృద్ధికి..
ఆటోరంగాన్ని ఆదుకోవడంలో భాగంగా వచ్చే ఏడాది మార్చి వరకు ‘బీఎస్–4’ వాహనాలను కొనుక్కోవడానికి అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ గడువు పూర్తయ్యేదాకా వాటిని వాడుకోవచ్చు. వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చే జూన్ వరకు యథావిధిగా కొనసాగుతోంది. కార్ల డిమాండ్ పెంచడంలో భాగంగా.. వీటిని కొనుగోలు చేయకుండా ప్రభుత్వశాఖలకు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటారు.
ఆర్థికాభివృద్ధి కోసం…
వాహనాలు, ఇళ్లు, వస్తువుల కొనుగోలుకు మరింత రుణం దొరికేలా చర్యలు ఉంటాయి. హెచ్ఎఫ్సీలకు అదనంగా రూ.20 వేల కోట్ల లిక్విడిటీ ఇస్తారు. ఫలితంగా లిక్విడిటీ సపోర్ట్ రూ.30 వేల కోట్లకు చేరుకుంది
బ్యాంకులకు రూ.70 వేల కోట్లు ఇస్తారు. తదనంతరం మరిన్ని నిధులు విడుదల చేస్తారు. ఎన్బీఎఫ్సీల ప్రస్తుత కస్టమర్లకు ఆధార్ ఆధారిత కేవైసీ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చారు.పీఎంఎల్ఏ, ఆధార్ చట్టాల్లో అవసరమైన మార్పులు చేస్తారు.
లిక్విడిటీని పెంచడం ద్వారా ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు, సెల్ఫ్హెల్ప్ గ్రూప్ల వంటి వారికి ఎన్బీఎఫ్సీల నుంచి, బ్యాంకుల నుంచి మరింత త్వరగా అప్పు అందేలా చూస్తారు. ఆన్లైన్ ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెడతారు.
ఓవర్డ్యూల సమస్య పరిష్కారానికి బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు, రిటైల్ రుణగ్రహీతలకు బ్యాంకులు ఓటీఎస్ విధానాన్ని అమలు చేస్తాయి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది.
నిజాయితీ కలిగిన బ్యాంకర్లకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేయడానికి కేంద్ర విజిలెన్స్ కమిషన్ ప్రత్యేక డైరెక్షన్స్ విడుదల చేస్తుంది. బ్యాంకుల ఇంటర్నల్ అడ్వైజరీ కమిటీ అవినీతి కేసులను వర్గీకరిస్తుంది.
జీడీపీ వృద్ధి అంచనాలను 6.2 శాతానికి కుదించిన మూడీస్
2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇండియా జీడీపీ వృద్ధి అంచనాలను 6.8 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్. వచ్చే ఆర్థిక సంవత్సర అంచనాలను కూడా ఇలానే తగ్గించి 6.7 శాతంగా నిర్ణయించింది. బలహీనమైన గ్లోబల్ ఎకానమీతో ఆసియా దేశాల్లో ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయని మూడీస్ తెలిపింది. నిర్వహణ వాతావరణంలో అనిశ్చితి నెలకొన్నట్టు పేర్కొంది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధి రేటు.. 2018–19 నాలుగో క్వార్టర్కు వచ్చేసరికి 5.8 శాతానికి దిగొచ్చింది. 2019–20 తొలి క్వార్టర్లో ఈ వృద్ధి 5.6 శాతానికి పడిపోతుందని మూడీఎస్ అంచనాలు వివరించాయి.
ముఖ్యాంశాలు
బ్యాంకులకు మూలధన అవసరాల కోసం రూ.70 వేల కోట్లు ఇస్తారు. తద్వారా మార్కెట్లో లిక్విడిటీని పెంచుతారు.
త్వరలో ప్రి–ఫైలింగ్ ఐటీ విదానాన్ని ప్రవేశపెడతారు. దసరా నుంచి ‘ఫేస్లెస్ స్క్రూటినీ’ విధానాన్ని తెస్తారు. కార్పొరేట్ నేరాలకు సంబంధించి 1,400 కేసులను ఉపసంహరించుకున్నారు. జీఎస్టీ రిటర్నులను తగ్గిస్తారు. ఫారాలను నింపే విధానం మరింత
సులువుగా ఉండేలా చర్యలు తీసుకుంటారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) రూల్స్ అతిక్రమణను నేరంగా పరిగణించరు. అకారణంగా ఐటీ అధికారుల వేధింపులు ఉండవు. రూల్స్ను అతిక్రమిస్తే భారీ జరిమానా విధిస్తారు. ప్రాసిక్యూషన్ ఉండదు.
స్టార్టప్లకు ఏంజెల్ ట్యాక్స్ రద్దు చేస్తారు. డీపీఐఐటీ రిజిస్ట్రేషన్ ఉన్న స్టార్టప్ లకు ఐటీలోని 56–2బీ సెక్షన్ వర్తించదు. స్టార్టప్ల పన్నుల సమస్యలను పరిష్కరించడానికి సీబీడీటీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు.
పరిశ్రమలకు మరింత చౌకగా వర్కింగ్ క్యాపిటల్ లోన్లు ఇస్తారు. వాహనాలు, ఇళ్లు, వస్తువులు కొనడానికి క్రెడిట్ సపోర్ట్ను పెంచుతారు.
ఇక నుంచి రెపోరేటు ప్రకారమే అన్ని బ్యాంకులూ అప్పులు ఇస్తాయి. పరిశ్రమలకు మరింత సులువుగా అప్పులు ఇచ్చేందుకు, బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల మధ్య సమన్వయాన్ని పెంచుతారు.
అమెరికా కంటే మనమే బెటర్
అమెరికా, చైనాతో పోలిస్తే మన ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంకులను, ఎన్బీఎఫ్సీ లను మరింత ఆదుకుంటాం. సంపద సృష్టించే వారిని ఎంకరేజ్చేస్తాం. రెపోరేట్లకు అనుగుణంగా అన్ని బ్యాంకులు లోన్ల రేట్లను మార్చుతాయి. వాహనాలు, ఇళ్లు, వస్తువుల కొనుగోలుకు మరింత రుణం లభిస్తుంది. ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులు, సెల్ఫ్హెల్ప్ గ్రూప్లకు ఎన్బీఎఫ్సీల నుంచి, బ్యాంకుల నుంచి మరింత త్వరగా అప్పు అందేలా చూస్తాం.– నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి