కోల్ మైనింగ్లో 100% ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు
కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్లోనూ వంద శాతం
డిజిటల్ మీడియాలో 26% విదేశీ పెట్టుబడులు
సింగిల్ బ్రాండ్ రిటైల్ కంపెనీలకు భారీ రిలీఫ్
స్టోర్లు లేకున్నా ఆన్లైన్లో అమ్మకాలకు పర్మిషన్
ఎఫ్డీఐ పాలసీపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
దేశంలో కొత్తగా 75 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
పెరగనున్న 15,700 పీజీ, ఎంబీబీఎస్ సీట్లు
ఆర్థిక మాంద్యం కమ్ముకుంటున్నవేళ.. ఎకానమీకి బూస్ట్ ఇచ్చే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. వృద్ధిని పెంచడమే లక్ష్యంగా విదేశీ సంస్థలకు వెల్కమ్ పలికింది. నాలుగు రంగాల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్(ఎఫ్డీఐ)కి సంబంధించిన రూల్స్ని సవరించింది. కీలకమైన కోల్ మైనింగ్, మాన్యుఫ్యాకచరింగ్ రంగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ)కు అనుమతిచ్చింది. సింగిల్ బ్రాండ్ రిటైర్లకు భారీ ఊరట కల్పిస్తూ ‘సోర్సింగ్’ రూల్స్ని సవరించింది. డిజిటల్ మీడియాలోనూ 26 శాతం ఎఫ్డీఐలకు గ్రీన్ సిగ్నలిచ్చింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ మేరకు తీసుకున్న నిర్ణయాలను కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి పియూష్ గోయల్ మీడియాకు వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్డీఐల ప్రవాహం తగ్గిపోతున్నా, మన దేశానికి మాత్రమే పెట్టుబడుల రాక పెరిగిందని, ఈ ట్రెండ్ను ఇంకా ప్రోత్సహిస్తే, ఇండియా ఎఫ్డీఐ హబ్గా తయారవుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని గోయల్ అన్నారు. బడ్జెట్ ప్రసంగంలోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని చెప్పారని గుర్తుచేశారు. మోడీ సర్కార్ ఫస్ట్ టర్మ్ ఐదేండ్ల(2014–19)లో మొత్తం 166 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు.
కోల్ మైనింగ్పై కీలక నిర్ణయం
బొగ్గు తవ్వకం దగ్గర్నుంచి దాన్ని శుద్ధిచేసి అమ్ముకునేదాకా విదేశీ సంస్థలకు ఆటోమెటిక్ విధానంలో(సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ అవసరం లేకుండా) అనుమతులు ఇస్తామని మంత్రి తెలిపారు. బొగ్గుతవ్వకాల్లో 100 శాతం ఎఫ్డీఐలను ఆహ్వానించడం ద్వారా విదేశీ మైనర్లను ఆకట్టుకోవచ్చని, తద్వారా బొగ్గు ఉత్పత్తి, థర్మల్ పవర్ ప్లాంట్లూ పెరుగుతాయని, దిగుమతుల భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. కోల్ ప్రొడక్షన్లో మన దేశం చైనా తర్వాతి స్థానంలో ఉంది. సింగరేణి, కోల్ ఇండియా లాంటి ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలోనే మెజార్టీ మైనింగ్ కొనసాగుతున్నది. పరిమితులతో కూడిన అనుమతుల కారణంగా బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేటు వాటా నామమాత్రంగానే ఉంది. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో కోల్మైనింగ్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఏర్పడింది.
సింగిల్ బ్రాండ్కు స్వింగ్
విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించిన రూల్స్ను కేంద్రం సవరించింది. ఇకపై సింగిల్ బ్రాండ్ రిటైల్ సంస్థలు తమ ఫిజికల్ స్టోర్ను ఇండియాలో ఏర్పాటు చేయకుండానే ఆన్లైన్ ద్వారా వస్తువుల్ని అమ్ముకోవచ్చు. 30 శాతం వనరుల్ని లోకల్గానే సమకూర్చుకోవాలన్న రూల్ని కూడా సవరించారు. దీని ద్వారా ఎకనమిక్ గ్రోత్ పెరిగి మేక్ ఇన్ ఇండియా పథకానికి బలం చేకూరుతుందని, ఉద్యోగావకాశాలూ పెరుగుతాయని గోయల్ చెప్పారు. దీంతోపాటు కాంట్రాక్ట్ మాన్యూఫ్యాక్చరింగ్ రంగంలోనూ 100 శాతం ఎఫ్డీఐలకు కేంద్రం అనుమతిచ్చింది. కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ చిన్నదైనా, పెద్దదైనా 100 శాతం ఎఫ్డీఐలకు పర్మిషన్ ఉంటుందని కామర్స్ మంత్రి తెలిపారు. డిజిటల్ మీడియాలోనూ 26 శాతం ఎఫ్డీఐలకు అనుమతిస్తామని అన్నారు.