
- పెండింగ్ పనులు పూర్తిచేయాలని నితీశ్ విజ్ఞప్తి
- రైట్ టైమ్ లో రైట్ లీడర్ మోదీ: చంద్రబాబు
- ప్రాంతీయ, జాతీయ ప్రయోజనాలు కాపాడాలి
- మోదీ వల్లే టీడీపీకి 16 సీట్లు వచ్చాయని వెల్లడి
- దేశాన్ని మోదీ ఇన్స్పైర్ చేశారు: పవన్ కల్యాణ్
న్యూఢిల్లీ: ప్రధానిగా ఎన్నికైన నరేంద్ర మోదీకి జేడీయూ అధినేత నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు బేషరతుగా మద్దతు తెలిపారు. పార్లమెంటు పాత భవనంలో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో నితీశ్, చంద్రబాబు.. మోదీకి ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ తాము ఎప్పటికీ మోదీతోనే ఉంటామన్నారు. ‘‘ప్రధాన మంత్రి పదవి కోసం ఎన్డీఏ లీడర్ నరేంద్ర మోదీకి మా పార్టీ జనతా దళ్ (యునైటెడ్) పూర్తి మద్దతు తెలుపుతున్నది. మోదీ తీసుకునే అన్ని నిర్ణయాల్లోనూ మేము ఆయన వెంట ఉంటాం. బీహార్ లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయని ఆశిస్తున్నాం. మోదీ నాయకత్వంలో బీహార్, ఇండియా ముందుకు వెళతాయి.
గత పదేండ్ల పాటు ప్రధానిగా పనిచేసిన తర్వాత మూడోసారి కూడా మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నందుకు మాకు ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. అన్ని రాష్ట్రాలకూ మోదీ సేవలందిస్తారని ఆశిస్తున్నా. మనమంతా మోదీతో కలిసి, మోదీ కెప్టెన్సీలో పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం. అయితే, మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈరోజే ఆ కార్యక్రమం ఉండుంటే బాగుండేది” అని నితీశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇండియా కూటమిపై ఆయన విమర్శలు చేశారు. కొంతమంది అక్కడక్కడా ఎంపీలుగా ఎన్నికయ్యారని, వచ్చేసారి వారందరూ ఓడిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు దేశానికి చేసిందేమీ లేదన్నారు. కాగా.. ఇండియా కూటమితో తాను టచ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై నితీశ్ స్పందిస్తూ.. ‘‘నేనెప్పుడూ ప్రధానితోనే ఉంటా” అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మోదీ కాళ్లకు నితీశ్ మొక్కబోగా.. మోదీ ఆయన చేతులు పట్టుకొని కృతజ్ఞతలు తెలిపారు.
ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది: చంద్రబాబు
రైట్ టైమ్ లో రైట్ లీడర్ నరేంద్ర మోదీయే అని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఎన్డీయేకు మద్దతు ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘‘నేను గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. చాలా మంది లీడర్లను చూశా. ప్రపంచంలో ఇండియాను గర్వించదగ్గ దేశంగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోదీదే. మోదీ నాయకత్వంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవించింది.
అలాగే ఆయన నాయకత్వంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగానూ నిలుస్తుంది. ఆ నమ్మకం నాకుంది. సమీప భవిష్యత్తులో మోదీ లీడర్ షిప్ లో మన ఇండియన్లు గ్లోబల్ లీడర్లు అవుతారు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే జాతీయ ప్రయోజనాలతో పాటు ప్రాంతీయ ప్రయోజనాలు కూడా కాపాడాలని, సమ సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలని మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మోదీ ర్యాలీల వల్ల టీడీపీకి 16 లోక్ సభ సీట్లు వచ్చాయన్నారు.
మోదీ ఉంటే మనం ఎవరికీ తల వంచం: పవన్
దేశాన్ని నరేంద్ర మోదీ నిజంగా ఇన్ స్పైర్ చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపిన తరువాత ఆయన మాట్లాడారు. దేశ ప్రధానిగా మోదీ ఉన్నంత కాలం.. మన దేశం ఎవరికీ తల వంచదని పవన్ అన్నారు.