
- హాజరైన సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పార్టీల నేతలు
- టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా హాజరు
వారణాసి (యూపీ)/గిరిడిహ్ (జార్ఖండ్) : లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి బరిలో నిలిచారు. వారణాసి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఆయన మంగళవారం ఉదయం 11.40కి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి యూపీ సీఎం యోగి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలు రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ కూటమి పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు.
తెల్లటి కుర్తా పైజామా, నీలి రంగు జాకెట్ ధరించిన మోదీ బీజేపీ అగ్ర నేతలు, ఇతరులతో కలిసి వారణాసి కలెక్టర్ ఆఫీసుకు వచ్చి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు మోదీ దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగా హారతి నిర్వహించి, పూజలు చేశారు. తర్వాత కాల భైరవ టెంపుల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. నామినేషన్ దాఖలు తర్వాత నేరుగా రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడారు.
ఎన్నికల్లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను నిర్దేశించారు. ఆర్టికల్ 370 రద్దుకు గుర్తుగా పోయిన ఎన్నికల కంటే ఈ సారి ప్రతి బూత్లోనూ కనీసం 370 ఓట్లు ఎక్కువ పడేలా చూడాలన్నారు.
గంగమ్మ నన్ను దత్తత తీసుకున్నది..
వారణాసితో తనకు ఉన్న సంబంధం ఒక తల్లికి బిడ్డతో ఉన్న సంబంధమని మోదీ తెలిపారు. ‘‘పదేండ్ల క్రితం గంగమ్మ తల్లి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు నన్ను దత్తత తీసుకున్నది” అని ఆయన పేర్కొన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు మోదీ ఆరు నిమిషాల వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ‘‘కాశీతో నా సంబంధం అద్భుతం. స్ఫూర్తిదాయకం. దేనితోనూ పోల్చలేనిది. మాటల్లో చెప్పలేనిది” అంటూ ఆయన ఈ వీడియోకు హిందీలో క్యాప్షన్ పెట్టారు.
నామినేషన్ వేసిన అనంతరం మోదీ ఈ విషయాన్ని ఎక్స్లో పంచుకున్నారు. ‘‘వారణాసి లోక్ సభ సీటు నుంచి నామినేషన్ వేశాను. ఈ చరిత్రాత్మకమైన ప్రాంత ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నా. గత పదేండ్లలో ఇక్కడ ఎన్నో పనులు పూర్తి చేశా. మున్ముందు మరిన్ని పనులు చేపట్టాల్సి ఉంది” అని ఆయన ట్వీట్ చేశారు.
ప్రముఖుల హాజరు
మోదీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, హర్దీప్ సింగ్ పురి, అనుప్రియా పటేల్, రామ్ దాస్ అథవాలె, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, మేఘాలయ సీఎం కోన్రాడ్ సంగ్మా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, బీజేపీ యూపీ చీఫ్ భూపేంద్ర చౌధరి
ఎన్ సీపీ నేత ప్రఫుల్ పటేల్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ అనారోగ్య కారణాల వల్ల కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. కాగా, వారణాసి లోక్ సభ స్థానానికి చివరిదైన ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పార్టీ స్టేట్ చీఫ్ అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అథర్ జమాల్ లారీ ఎన్నికల బరిలో ఉన్నారు.
రాముడిని మళ్లీ టెంట్లోకి పంపే కుట్ర..
అయోధ్య గుడిలోని బాల రాముడిని మళ్లీ టెంట్ లోకి పంపాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆ పార్టీవి సిగ్గుమాలిన రాజకీయాలు అని మండిపడ్డారు. మంగళవారం వారణాసిలో నామినేషన్ వేసిన తర్వాత మోదీ జార్ఖండ్ కు చేరుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గిరిడిహ్ పట్టణంలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. జార్ఖండ్ లోని అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అవినీతి, బుజ్జగింపులు, కుటుంబ రాజకీయాలకు అతిపెద్ద మోడల్ గా మారాయన్నారు.
రాముడి గుడిపై కాంగ్రెస్ నేతలు సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పుకు సైతం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రామాలయం పరిసరాలకు మళ్లీ తాళం వేసేందుకు కుట్ర చేస్తున్నారని, వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నక్సలిజంలోకి నెడితే.. తాము నక్సలిజాన్ని నిర్మూలిస్తున్నామని మోదీ చెప్పారు.
తాను మూడోసారి అధికారంలోకి వచ్చాక నక్సలిజం, టెర్రరిజాన్ని దేశం నుంచి పూర్తిగా నిర్మూలిస్తానన్నారు. రాష్ట్రంలోని అధికార జేఎంఎం కూటమి చొరబాటుదారులను పెంచి పోషిస్తోందన్నారు. తాను అణగారిన వర్గాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
మోదీ ఆస్తులు రూ. 3.02 కోట్లు..భూమి, ఇల్లు, కారు లేవు
తనకు సొంత భూమి, ఇల్లు, కారు లేవని ప్రధాని మోదీ ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు. మొత్తంగా తనకు రూ. 3.02 కోట్ల ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. వీటిలో రూ. 2.86 కోట్లు ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం చేతిలో రూ. 52,920 నగదు ఉన్నదని, గాంధీనగర్, వారణాసిలోని రెండు బ్యాంక్ ఖాతాల్లో రూ. 80,304 ఉన్నాయని పేర్కొన్నారు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ లో రూ. 9.12 లక్షలు పెట్టుబడిగా పెట్టినట్టు తెలిపారు. రూ. 2.68 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయని వెల్లడించారు.
2018–19లో తన ఆదాయం రూ. 11.14 లక్షలుగా చూపిన ప్రధాని.. 2022–23లో తన ఆదాయం రూ. 23.56 లక్షలకు పెరిగినట్టు ప్రకటించారు. ఇక విద్యార్హతలకు సంబంధించిన కాలమ్ లో.. తాను 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేసినట్టు మోదీ తెలిపారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్ లో లేవని పేర్కొన్నారు.
బ్రాహ్మణ, ఓబీసీ, దళిత వర్గాల నుంచి నలుగురు ప్రపోజర్లు
వారణాసి లోక్ సభ అభ్యర్థిగా మోదీని ప్రతిపాదిస్తూ పండిట్ గణేశ్వర్ శాస్త్రి, బైజ్ నాథ్ పటేల్, లాల్ చంద్ కుశ్వాహా, సంజయ్ సోంకర్ అనే నలుగురు ప్రపోజర్లుగా సంతకాలు చేశారు. వీరిలో ఒకరు బ్రాహ్మణ, ఇద్దరు ఓబీసీ, మరొకరు దళిత వర్గానికి చెందినవారు ఉన్నారు. నామినేషన్ కార్యక్రమానికి నలుగురు ప్రపోజర్లూ హాజరయ్యారు.