న్యూఢిల్లీ : బెట్టింగ్ వెబ్సైట్లు/ప్లాట్ఫారాలు మన ఎకానమీకి ముప్పుగా మారాయి. వీటి ద్వారా డబ్బు ఇండియా దాటి అక్రమంగా ఇతర దేశాలకు చేరుతోంది. ఇలాంటి సంస్థల్లో అత్యధికంగా చైనావే ఉన్నాయి. పేమెంట్ గేట్వేల ద్వారా ఇవి డబ్బును తమ సొంత దేశాలకు రప్పించుకుంటున్నాయి. పేమెంట్ గేట్వేలు తెలియకుండానో, ఉద్దేశపూర్వకంగానో ఇలా చేస్తున్నాయి. ఇవి మర్చంట్ల కేవైసీ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం చాలా సమస్యలకు దారి తీస్తోంది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వీటి వెంటపడుతోంది. చైనీస్ లోన్ యాప్ కేసులో పేమెంట్ గేట్వే కంపెనీలైన రేజర్పే, క్యాష్ఫ్రీ, పేటీఎం కార్యాలయాలపై పోయిన వారం ఈడీ దాడి చేసింది. అయినప్పటికీ కొన్ని వెబ్సైట్లు తమ వ్యాపారాన్ని నిరాటంకంగా సాగిస్తున్నాయి. విదేశాల నుంచి పనిచేసే బెట్వే డాట్కామ్, బెట్65 కామ్ వంటి గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సైట్లు, భారతీయ కస్టమర్ల నుంచి యూపీఐతో సహా అన్ని రకాల భారతీయ పేమెంట్ పద్ధతుల ద్వారా డబ్బు తీసుకుంటున్నాయి. గ్యాంబ్లింగ్ వెబ్సైట్ల కస్టమర్ల కు నెట్బ్యాంకింగ్, ఐఎంపీఎస్, యూపీఐ వంటి పేమెంట్ పద్ధతులను ఉపయోగించడానికి అనుమతి ఉండదు. ఇలాంటి యాప్స్ మోసపూరితంగా మర్చంట్ ఐడెంటిఫికేషన్కోడ్ (ఎంఐడీ) వాడి భారతీయ బ్యాంకులను మోసగిస్తున్నాయి. కొన్ని పేమెంట్-గేట్వే కంపెనీలు చైనీస్ లోన్ యాప్లతోపాటు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ బిజినెస్లకు సాయం చేస్తున్నాయని ఈడీ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం అనేక చైనీస్ లెండింగ్ యాప్లను నిషేధించినప్పటికీ కొత్త క్లోన్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈ యాప్లు లోన్లు ఇవ్వడానికి, కస్టమర్ల నుంచి తిరిగి వసూలు చేయడానికి పేమెంట్ గేట్వే అవసరం. లోన్ కట్టనివారిని ఇవి తీవ్రంగా వేధిస్తున్నాయి. వారి బంధువులను, కుటుంబ సభ్యులను కూడా వేధిస్తున్నాయి. ఫలితంగా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు.
మోసం జరుగుతున్నది ఇలా..
ఇండియా నుంచి డబ్బు విదేశీ ఖాతాలకు వెళ్లాలంటే పేమెంట్ గేట్వే తప్పనిసరి. ఆసియా కప్ సమయంలో ఫెయిర్ప్లే, డాట్క్లబ్ అనే ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫారమ్ ప్రకటనలు వెల్లువెత్తాయి. భారతదేశంలో ఆన్లైన్ బెట్టింగ్ చట్టవిరుద్ధం అయినా వీటి యాడ్స్ కొనసాగుతున్నాయి. నో యువర్ కస్టమర్ (కేవైసీ) రిజిస్ట్రేషన్ను పరిశ్రమ పరిభాషలో ఎంఐడీ అని కూడా పిలుస్తారు. ఎంఐడీలతో కొన్ని సంస్థలు డీకేసన్@యెస్బ్యాంక్ డాట్కామ్అనే ఐడీ ద్వారా పేమెంట్లను తీసుకుంటున్నాయి. యూపీఐ, బ్యాంక్ ట్రాన్స్ఫర్, క్రిప్టో వంటి పద్ధతులను వాడుకుంటున్నాయి. ఫెయిర్ప్లే డాట్ క్లబ్ వాడే మర్చంట్లలో డీకే సన్ ఒకరు కావచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఈ కంపెనీల దగ్గర అప్రూవ్డ్ ఎంఐడీల రిపోజిటరీ ఉంది. పేమెంట్లలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రతి 15-20 నిమిషాలకు పేమెంట్ గేట్వేలను, బ్యాంకులను మారుస్తూ ఉంటాయి. దీంతో బ్యాంకులు మోసాలను గుర్తించడం కష్టమవుతుంది. చట్టబద్ధ లావాదేవీల కోసం వాడే ఎంఐడీలనే ఉపయోగించి మర్చంట్ కేవైసీ అప్రూవల్ సంపాదిస్తారు. బ్యాంకు/ఎన్సీపీఐ ఎంఐడీని లేదా యూపీఐని ఐడీ బ్లాక్ చేసినా, ఇతర ఎంఐడీ, యూపీఐ ఐడీలను వాడుతారు. మరోసారి పట్టుకునే వరకు వ్యాపారం నడుస్తూనే ఉంటుంది. రూల్స్ ప్రకారం మర్చంట్ కేవైసీని వాడుతున్నారా అని తెలుసుకోవడానికే ప్రయత్నించే బ్యాంకుల ఐపీని కూడా యాప్లు అడ్డుకుంటాయి.