బిజినెస్ డెస్క్, వెలుగు: ఇండియన్ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చని ఫారిన్ బ్రోకరేజ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. జపాన్ మార్కెట్ మినహాయించిన ఆసియా ఎమెర్జింగ్ మార్కెట్స్ బాస్కెట్లో మన మార్కెట్కు నెంబర్ వన్ స్థానాన్ని ఇచ్చింది. ఇండియన్ షేర్ మార్కెట్పై రేటింగ్ను ఓవర్వెయిట్కు(కొనొచ్చు) అప్గ్రేడ్ చేసింది. కొరియా, యూఏఈ వంటి స్టాక్ మార్కెట్లను దాటి మోర్గాన్ స్టాన్లీ లిస్టులో ఇండియన్ మార్కెట్ టాప్ పొజిషన్ దక్కించుకుంది. కిందటేడాది అక్టోబర్తో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్ వాల్యుయేషన్ క్లిష్టంగా లేదని, సంస్థాగతంగా అప్ట్రెండ్ కనిపిస్తోందని ఈ బ్రోకరేజ్ కంపెనీ వెల్లడించింది. ప్రభుత్వం క్యాపెక్స్కు భారీగా ఖర్చు చేస్తుండడం, మాక్రో లెవెల్లో స్టెబిలిటీ ఉండడం, రీఫార్మ్స్ తెస్తుండడంతో ఎఫ్డీఐ, పోర్టుఫోలియో ఇన్వెస్ట్మెంట్లను ఇండియన్ మార్కెట్ ఆకర్షిస్తోంది. కాగా, కరోనా తర్వాత చైనాలో డిమాండ్ రికవ రీ కాలేదని మోర్గాన్ స్టాన్లీ వెల్లడించింది. ఈ దేశ స్టాక్ మార్కెట్లపై వెయిటేజ్ను డౌన్గ్రేడ్ చేసింది.
స్టాక్ రికమండేషన్స్..
ఫైనాన్షియల్, కన్జూమర్ డిస్క్రిషనరీ, ఇండస్ట్రీయల్స్ షేర్లపై మోర్గాన్ స్టాన్లీ ఓవర్వెయిట్ (కొనొచ్చు) రేటింగ్ ఇచ్చింది. మారుతి సుజుకీ షేర్ టార్గెట్ ధరను రూ.9,717 గా, ఎల్ అండ్ టీ షేర్ టార్గెట్ ధరను రూ.2,668 గా నిర్ణయించింది. తన ఫోకస్ లిస్టులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్, ఐసీఐసీఐ బ్యాంక్లను కూడా చేర్చింది.
జీడీపీ గ్రోత్ 6.7 శాతం..
ఇండియన్ ఎకానమీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని బ్రోకరేజ్ కంపెనీ ఎస్ అండ్ పీ గ్లోబల్ అంచనావేసింది. 2030–31 నాటికి దేశ జీడీపీ 6.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఇండియా జీడీపీ 3.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ‘లుక్ ఫార్వార్డ్ ఇండియా మూమెంట్’ రిపోర్ట్లో ఈ విషయాలను ప్రస్తావించింది.
13 ఏళ్ల గరిష్టానికి సర్వీస్ సెక్టార్ పీఎంఐ
దేశ సర్వీసెస్ సెక్టార్ దూసుకుపోతోంది. కొత్త ఆర్డర్లు పెరగడంతో సర్వీస్ సెక్టార్ పనితనాన్ని కొలిచే పీఎంఐ ఇండెక్స్ జులైలో 62.3 కి ఎగిసింది. జూన్లో ఈ నెంబర్ 58.2 గా, మేలో 61.2 గా రికార్డయ్యింది. ఎస్ అండ్ పీ సర్వీసెస్ పీఎంఐ 2010 లో 62.3 గా రికార్డయ్యింది. ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్గా కొనసాగింది. కాగా, పీఎంఐ ఇండెక్స్ 50 పైన ఉంటే సంబంధిత సెక్టార్ విస్తరిస్తున్నట్టు. 2021 ఆగస్టు నుంచి సర్వీసెస్ పీఎంఐ 50 పైనే నమోదవుతుండడం విశేషం.
కొనసాగిన పతనం
బెంచ్మార్క్ ఇండెక్స్ల పతనం వరుసగా మూడో సెషన్లో కూడా కొనసాగింది. యూఎస్ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను ఫిచ్ రేటింగ్స్ డౌన్గ్రేడ్ చేయడంతో గ్లోబల్ మార్కెట్లు గురువారం సెషన్లో కూడా క్రాష్ అయ్యాయి. ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుండడంతో బెంచ్మార్క్ ఇండెక్స్ నిఫ్టీ గురువారం 145 పాయింట్లు (0.74 శాతం) నష్టపోయి 19,382 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 542 పాయింట్లు పడి 65,241 వద్ద సెటిలయ్యింది. నిఫ్టీలో యూపీఎల్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, ఐషర్ మోటార్స్, దివీస్ ల్యాబ్స్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఫార్మా ఇండెక్స్ గ్రీన్లో క్లోజవ్వగా, బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్టీ ఇండెక్స్లు 1–2 శాతం వరకు క్రాష్ అయ్యాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు ఫ్లాట్గా సెటిలయ్యాయి.
ఎనలిస్టులు ఏమంటున్నారంటే?
‘బేర్స్ ఆధిపత్యం కొనసాగడంతో నిఫ్టీ మరింత కిందకి పడింది. 19,500 లెవెల్ను కోల్పోయిన ఈ ఇండెక్స్కు 19,300 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లభించింది. ముందుకెళ్లే కొద్దీ ఈ లెవెల్ నిఫ్టీకి కీలక సపోర్ట్గా పనిచేస్తుంది. పైన 19,500–19,650 లెవెల్స్ రెసిస్టెన్స్గా పనిచేస్తాయి’ అని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ ఎనలిస్ట్ కునాల్ షా అన్నారు. బ్యాంక్ నిఫ్టీ కూడా బేర్స్ కంట్రోల్లో ఉందని చెప్పారు. 44,500–44,400 లెవెల్ కీలక సపోర్ట్గా పనిచేస్తుందని, ఈ లెవెల్ను కోల్పోతే 44 వేల లెవెల్ వరకు పడిపోతుందని వెల్లడించారు. ఈ లెవెల్పైన కదిలితే 45,000– 45,200 వరకు ర్యాలీ వస్తుందని అభిప్రాయపడ్డారు.
యూఎస్ రేటింగ్ డౌన్గ్రేడ్ ప్రభావం ఇంకా గ్లోబల్ మార్కెట్లపై కనిపిస్తోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. బాండ్ ఈల్డ్లు పెరగడం, డాలర్ ఇండెక్స్ బలపడడం గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లపై నెగెటివ్ ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. రిజల్ట్స్ నేపథ్యంలో ఫార్మా షేర్లు మాత్రం లాభాల్లో కదులుతున్నాయని అన్నారు.