వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలుస్తం : ఎంపీ అర్వింద్

వచ్చే ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలుస్తం : ఎంపీ అర్వింద్

మోడీతో ఎంపీ అర్వింద్ 15 నిమిషాల పాటు భేటీ

న్యూఢిల్లీ, వెలుగు : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 80కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రధాని మోడీ పూర్తి విశ్వాసంతో ఉన్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారని చెప్పారు. మంగళవారం పార్లమెంట్‌‌‌‌లోని పీఎం ఆఫీసులో మోడీతో అర్వింద్ భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాలపాటు అర్వింద్‌‌‌‌తో ప్రధాని ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది. తర్వా త తన నివాసంలో మీడియాతో అర్వింద్ చిట్ చాట్ చేశారు. 

రాష్ట్రంలోని పొలిటికల్, పాలన వ్యవస్థ తీరును ప్రధాని అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. తెలంగాణలో కమల వికాసంపై స్టేట్ లెవల్ లీడర్స్ కన్నా, బీజేపీ అధిష్టానం ఫుల్ క్లారిటీతో ఉందన్నారు. రాష్ట్రంలో ఇకపై ‘సాఫ్ సఫాయి’  జరుగుతుందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 80 స్థానాల్లో గెలిచేలా బీజేపీ వ్యూహాలకు పదునుపెట్టిందని అన్నారు. దాదాపు ఐదు సార్లు బీఆర్ఎస్ నేతలు తనపై చేసిన దాడుల గురించి ప్రధాని వాకబు చేశారని తెలిపారు. ఇటీవల తన ఇంటిపై జరిగిన దాడి గురించి ప్రధాని ఆరా తీశారని వివరించారు. తెలంగాణలో కమల వికాసంపై మోడీ దిశా నిర్దేశం చేశారని ప్రధానితో భేటీ తర్వాత అర్వింద్ ట్వీట్ చేశారు. బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు వెల్లడించారు.