తిరుమల డిక్లరేషన్ అంశం మీద నడుస్తున్న వివాదం మీద కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది భక్తుల విశ్వాసమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం కేంద్రంగా జరుగుతున్న రాజకీయ, వివాదాస్పద పరిణామాలు చాలా బాధాకరమని ఆయన అన్నారు.
‘మత విశ్వాసాలు, ఆచార వ్యవహారాల పట్ల రాజకీయ జోక్యంతో వివాదాలు చేయడం తగదు. ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు అనాదిగా వస్తున్నాయి. వాటిలోని లోతుపాతుల్ని విచారించేది, శాస్త్ర పద్ధతుల్లో చర్చించేది స్వామీజీలు, పీఠాధిపతులు, మతపెద్దలు. అటువంటి విషయాలలో రాజకీయ నేతలు తలదూర్చడం భావ్యం కాదు.
హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకుని, అనుచితంగా మాట్లాడం గర్హనీయం. మత విశ్వాసాలు, ఆచార, సంప్రదాయాల్లో రాజకీయ నేతలు కలగజేసుకుంటే.. వారి భవితవ్యాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. సమాజంలోని అన్ని వర్గాల్ని సమదృష్టితో చూడాల్సిన పాలకులు.. సున్నితమైన మనోభావాల్ని దెబ్బతీసేలా వ్యవహరించడం, మాట్లాడటం సరికాదు.
ప్రభుత్వంలోని కొందరు నేతలు సంయమనం కోల్పోయి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ప్రధాని మోదీపై, యూపీ సీఎం యోగిపై కొందరు నేతలు నోరు జారి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. కొందరు నేతలు బాధ్యతను మరచి విమర్శలు చేయడం ఫ్యాషన్గా భావిస్తున్నారు.
అంతర్వేదిలో రథం కాలిపోతే చెక్క కాలిపోయిందంటూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణం. దేశవ్యాప్తంగా హిందూ సమాజం స్పందిస్తున్నా.. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేతల్ని కట్టడి చేసి.. చర్యలు తీసుకోవాల్సిన నేతలు మౌనం వహించడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి’ అని ఆయన ట్వీట్ చేశారు.
For More News..