
హైదరాబాద్, వెలుగు: దేశంలోని మైనార్టీల సంక్షే మం కోసం మోడీ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మైనార్టీల్లో బాగా వెనకబడిన వర్గాల అభివృద్ధే ధ్యేయంగా మోడీ పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వీటిని సద్వినియోగం చేసుకొని సమాజంలో ఆర్థికంగా ఎదగాలని సూచించారు. శనివారం హైదరాబాద్ లక్డీకాపూల్లో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని లక్ష్మణ్ ప్రారంభించి మాట్లాడారు. మైనార్టీల రక్షణ, భద్రత విషయంలో మోడీ సర్కార్, బీజేపీ పూర్తి భరోసానిస్తోందని, మతాలు ఏవైనా అన్ని వర్గాల వారు ఆర్థికంగా ఎదగాలన్నదే మోడీ ఉద్దేశమన్నారు. హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలో బీజేపీ యువ మోర్చా రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమాలు శనివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఇవి కొనసాగనున్నాయి.
బీజేపీ స్టేట్ ఆఫీసులో రాజ్యాంగ దినోత్సవం
బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో పార్టీ స్టేట్ ఆఫీసులో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సాంబమూర్తి, చంద్ర శేఖర్, అశోక్, క్రాంతి, భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.