
- పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా విద్య, వైద్యం, ఉపాధి
నాగర్ కర్నూల్, వెలుగు: వ్యవసాయం, స్వయం ఉపాధి ఇతర ప్రాధాన్య రంగాల్లో అర్హులకు లోన్లు నిరాకరించడం నేరమని ఎంపీ మల్లు రవి అన్నారు. లక్ష్యాల మేరకు లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో దిశ చైర్మన్, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అధ్యక్షతన దిశ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. జిల్లాలోని పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని కోరారు. జిల్లా సమగ్ర అభివృద్ది కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.
ప్రణాళికాబద్ధంగా లక్ష్యాల సాధన
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలు ప్రణాళికా బద్ధంగా అమలు చేసి తీరాలన్నారు. బ్యాంకర్లు జిల్లాలో కేటాయించిన లక్ష్యం మేరకు అన్ని రంగాలకు రుణాలను అందించాలన్నారు. ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు రుణాలు అందించాలని జాతీయ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులకు సూచించారు. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుతో పేద ప్రజల ఉపాధి, ఆర్థిక అభివృద్ధి సాధ్యమన్నారు. కొన్ని బ్యాంకులు లక్ష్యాలను చేరకపోవడంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అర్హులకు లోన్లు నిరాకరించడం నేరం కిందికి వస్తుందని హెచ్చరించారు. పాడి పరిశ్రమ యూనిట్లు ఎందుకు గ్రౌండ్ కావడం లేదని ప్రశ్నించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో నేషనల్ హైవేల నిర్మాణాలు, ప్రతిపాదనలు,పెండింగ్ అంశాలపై అధికారులను వివరాలు అడిగారు. అంతరాష్ట్ర రహదారుల నిర్మాణం కింద మద్దిమడుగు- మాచారం బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. 2017 –2025 సంవత్సరం వరకు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు అందించే రుణాల గ్రౌండింగ్ ను పూర్తి చేయాWQWWలని, బ్యాంకర్లు ఎస్సీ కార్పొరేషన్ నిధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన
ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్యా వ్యవస్థలో మార్పులు
ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుతో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వస్తాయన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ గురుకులాల్లో టీచింగ్ ఫ్యాకల్టీ, స్టాఫ్ వివరాలు, ఖాళీలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్ పనితీరు మెరుగుపడాలన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పారిశ్రామిక వేత్తలను తయారు చేయాలనేది తన కల అన్నారు.
పీహెచ్సీల పనితీరు మెరుగుపడాలి
జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు సజావుగా జరుగుతున్నాయని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూల్, అచ్చంపేట ఎమ్మెల్యేలు డా.రాజేశ్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. నియోజకవర్గాల పరిధిలో ఉన్న సమస్యలను వివరించారు. జిల్లాలోని పీహెచ్సీల పనితీరు మెరుగు పడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు రెగ్యులర్గా తనిఖీలు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, డీఎఫ్ఓ రోహిత్ గోపిడి, డీఆర్డీఓ చిన్న ఓబులేసు, వివిధ శాఖల అధికారులు దిశ కమిటీ సభ్యులు వంకేశ్వరం మణెమ్మ, ఎం.భగవంత్ రెడ్డి, వి.చిన్నయ్య, మూడావత్ మోతీలాల్ పాల్గొన్నారు.