- ఇందుకోసం ఇన్నోవేటివ్ స్కీమ్
న్యూఢిల్లీ: చిన్న,మధ్యస్థాయి ఇండస్ట్రీల (ఎంఎస్ఎంఈలు)ను ఆదుకోవడానికి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. క్రెడిట్ ఫైనాన్స్ ఇవ్వడం ద్వారా వీటికి మరింత మేలు చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్ఎంఈల కోసం కొత్త బిజినెస్ ఐడియాల అమలు, పేటెంట్ల కోసం రూ. 34 కోట్ల విలువైన ఆర్థిక సహాయం ఇవ్వాలనే ప్రపోజల్కు ఆమోదం వచ్చిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ పార్లమెంటులో ప్రకటించారు.
ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 2022 కింద 257 ఐడియాలు, 1,196 ట్రేడ్మార్క్ల రీయింబర్స్మెంట్, 186 పేటెంట్లు, 53 డిజైన్లు 11 జాగ్రఫికల్ ఇండికేషన్ల (జీఐలు)కు ఆర్థిక సాయం చేయడానికి 2023 ఆర్థిక సంవత్సరంలోనే నిధులు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే పేటెంట్, ట్రేడ్మార్కుల ఫైలింగ్ కోసం అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర ఎంఎస్ఎంఈశాఖ మంత్రి నారాయణ్ రాణే ఈ ఏడాది మార్చిలో ప్రారంభించిన ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ స్కీమ్లోని ‘ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్’ కింద ఎంఎస్ఎంఈ రంగంలో మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్) ఇనోవేషన్, రూపకల్పన, రక్షణ కోసం ఈ సహాయాన్ని అందిస్తారు. ఈ పథకంతో పాటు హ్యాకథాన్ను కూడా ప్రారంభించారు.
ఎంఎస్ఎంఈ ఇనోవేటివ్ కాంపోనెంట్ కింద ఎంపికైన ప్రతి ఐడియా అమలుకు రూ. 15 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. పథకం ఇంక్యుబేషన్లో భాగంగా సంబంధిత ప్లాంట్, యంత్రాల కోసం రూ. కోటి వరకు ఇస్తారు. డిజైన్ పార్ట్, డిజైన్ ప్రాజెక్ట్లకు రూ. 40 లక్షల వరకు, స్టూడెంట్ ప్రాజెక్ట్లకు రూ. 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇలా చేయడం ద్వారా కొత్త ప్రొడక్ట్ అభివృద్ధికి డిజైన్ సమస్యలు ఉండవు. దాని మెరుగుదల కోసం ఎక్స్పర్టులు సలహాలు ఇస్తారు.
పేటెంట్ దాఖలుకు రూ.ఐదు లక్షలు..
దేశంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ (ఐపీఆర్) సంస్కృతిని మెరుగుపరచడానికి విదేశాల్లో పేటెంట్ దాఖలు చేయడానికి ఇండియన్ ఎంఎస్ఎంఈలకు రూ. 5 లక్షల వరకు ఇస్తారు. దేశీయ పేటెంట్ కోసం అయితే రూ. లక్ష, జీఐ రిజిస్ట్రేషన్ కోసం రూ. 2 లక్షలు, డిజైన్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 15,000, ట్రేడ్మార్క్ కోసం రూ. 10,000 వరకు సహాయం అందిస్తారు. రీయింబర్స్మెంట్ రూపంలో ఈ మొత్తాలను చెల్లిస్తామని కేంద్రం ఎంఎస్ఎంఈల మంత్రిత్వశాఖ తెలిపింది. “భారతదేశం ఆత్మనిర్భర్గా మారుతున్నది.
విదేశాలపై ఆధారపడటం తగ్గుతోంది. ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద ఎత్తు ఉపాధిని కల్పించవచ్చని, వ్యవస్థాపకతను పెంపొందించుకోవచ్చని, జీడీపీ, ఎగుమతులను పెంపొందించుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ నమ్ముతారు. ఎంఎస్ఎంఈల వినూత్న ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి మేం ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ను ప్రకటించాం. అమెరికా, చైనా వంటి దేశాల్లో వ్యాపారాలు సాధించిన విధంగా తయారీరంగంలో అధిక గ్రోత్ను సాధించడానికి మన సంస్థలు కూడా ప్రయత్నించాలి ”అని మంత్రి నారాయణ్ రాణే పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా అన్నారు.
పేటెంట్లు, డిజైన్లు ట్రేడ్మార్క్ల కంట్రోలర్ జనరల్ (సీజీపీడీటీ) అందజేసిన వివరాల ప్రకారం.. ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు ఇతరుల పేటెంట్ ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్లు 2016-2021 ఆర్థిక సంవత్సరాల మధ్య నాలుగు రెట్లు పెరిగాయి. 2015-16లో 6,326 పేటెంట్లు జారీ కాగా 2020-21లో ఈ సంఖ్య 28,391కి పెరిగింది. 2015-16లో 65,045 ట్రేడ్మార్క్లు రిజిస్టర్ కాగా, 2020-21లో వీటి సంఖ్య 2,55,993కి పెరిగింది. 2015-16లో 4,505 కాపీరైట్లు మంజూరు కాగా, 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 16,402కి పెరిగింది.