
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (తొలి క్వార్టర్) మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)లకు బ్యాంక్ లోన్లు ఇవ్వడం తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది. దేశీయ పరిశ్రమకు వెన్నెముక అయిన ఎంఎస్ఎంఈలకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాంకులు వీటికి అప్పులు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని తెలిపింది. మధ్య తరహా పరిశ్రమలకు అప్పులు 13.2 శాతం (గత ఏడాది 47.8 శాతం), సూక్ష్మ, చిన్న పరిశ్రమలు 13 శాతం (ఏడాది క్రితం 29.2 శాతం) మాత్రమే పెరిగాయి.
గత ఏడాది జూన్లో రూ. 2,32,776 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది జూన్ చివరి నాటికి మధ్యతరహా పరిశ్రమలకు స్థూల బ్యాంకు లోన్ బకాయిలు రూ.2,63,440 కోట్లుగా ఉన్నాయి. సూక్ష్మ చిన్న పరిశ్రమల విషయానికొస్తే, జూన్లో లోన్ బకాయిల విలువ రూ. 5,53,675 కోట్ల నుంచి రూ.6,25,625 కోట్లకు పెరిగింది. మే నెలలో మధ్యతరహా పరిశ్రమలకు అప్పులు 18.9 శాతం (గత ఏడాది 42.9 శాతం), సూక్ష్మ, చిన్న పరిశ్రమలు 9.5 శాతం (ఏడాది క్రితం 32.7 శాతం) పెరిగాయి. ఏప్రిల్లో మధ్యతరహా పరిశ్రమల లోన్ల వృద్ధి గత ఏడాది 53.7 శాతం నుంచి 19.1 శాతానికి పడిపోయింది. సూక్ష్మ చిన్న పరిశ్రమల విషయంలో వృద్ధి 29 శాతం నుంచి 2023 ఏప్రిల్లో 9.7 శాతానికి పడిపోయింది.
భారీగా క్రెడిట్ గ్యాప్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల కోసం 2018లో నియమించిన నిపుణుల కమిటీ, ఎంఎస్ఎంఈ రంగంలో మొత్తం క్రెడిట్ గ్యాప్ రూ. 20 లక్షల కోట్ల నుంచి రూ. 25 లక్షల కోట్ల పరిధిలో ఉంటుందని అంచనా వేసింది. రక్షణ, రైల్వే రంగానికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసే ఎంఎస్ఎంఈ -- శామ్టెల్ ఏవియానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ కౌరా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రంగానికి తగిన సకాలంలో లోన్లు అందించడానికి బ్యాంకులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయాలని అన్నారు. ప్రస్తుతం పెద్ద సంస్థలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.
ఎంఎస్ఎంఈల గ్రాస్ నాన్-పెర్ఫార్మింగ్ అడ్వాన్స్లు మార్చి చివరి నాటికి రూ.1,31,928 కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం ఇవి రూ.1,54,094 కోట్లు కాగా, మార్చి 2021లో రూ.1,82,114 కోట్లుగా ఉన్నాయి. ఎంఎస్ఎంఈ రంగానికి క్రెడిట్ను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వచ్చేలా, మైక్రో & స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద గ్యారెంటీ కవరేజ్ క్రెడిట్ పరిమితి రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచింది. వార్షిక గ్యారెంటీ ఫీజులు 50 శాతం తగ్గాయి. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీల కింద, ఎంఎస్ఎంఈలలో రూ. 50వేల కోట్ల ఈక్విటీని చొప్పించడానికి ప్రభుత్వం ఫండ్ ఆఫ్ ఫండ్లను ప్రకటించింది.