
- మరిన్ని చెట్లు నాటుదాం: మంత్రి సీతక్క
ములుగు, వెలుగు: ములుగును అడవుల జిల్లాగా తీర్చిదిద్దుతామని మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం ములుగు మండలం ఇంచర్లలోని ఎకో పార్కులో కలెక్టర్ దివాకర టీఎస్, ఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్, టీజీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం, డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, లైబ్రరీ చైర్మన్ బానోత్ రవిచందర్తో కలిసి మొక్కలు నాటారు.
గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సు నుంచి సాగునీటిని పంట కాలువలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోందని, జిల్లాలోని అడవులను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులకు సాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రామప్ప నుంచి లక్నవరం సరస్సు వరకు కెనాల్ నిర్మించి రెండు పంటలకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. ఇరిగేషన్ ఈఈ నారాయణ, అధికారులు పాల్గొన్నారు.