
ములుగు, వెలుగు : ములుగు జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో నడుస్తున్న సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల స్కూల్, కాలేజీకి తాళం పడింది. 14 నెలల నుంచి రెంట్ ఇవ్వడం లేదని ఆగ్రహానికి గురైన బిల్డింగ్ ఓనర్ సమ్మయ్య స్కూల్ బిల్డింగ్కు, గేట్కు తాళం వేశాడు. దసరా సెలవులు ముగియడంతో సోమవారం స్కూల్కు వచ్చిన స్టూడెంట్లు తాళాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. డ్యూటీకి వచ్చిన టీచర్లు, లెక్చరర్లు సైతం ఆరుబయటే వేచి ఉన్నారు. ఈ విషయంపై భవన యజమాని సమ్మయ్య కలెక్టర్ దివాకర టీఎస్ను కలిశారు. తనకు నెలకు సుమారు రూ. 2.60 లక్షల చొప్పున 14 నెలల అద్దె పెండింగ్లో ఉందని, డబ్బులను వెంటనే చెల్లించాలని కోరారు. నాలుగు రోజుల్లో అద్దె చెల్లించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో తాళం తీసి స్కూల్ను ఓపెన్ చేశారు.