ముంబై సిక్సర్‌‌‌‌ .. వరుసగా ఆరో విజయంతో టాప్‌‌లోకి .. ప్లే ఆఫ్స్‌‌ నుంచి రాయల్స్‌‌ నిష్క్రమణ

ముంబై సిక్సర్‌‌‌‌ .. వరుసగా ఆరో విజయంతో టాప్‌‌లోకి .. ప్లే ఆఫ్స్‌‌ నుంచి రాయల్స్‌‌ నిష్క్రమణ
  • 100 రన్స్‌‌ తేడాతో రాజస్తాన్‌‌పై గెలుపు
  • రికెల్టన్‌‌, రోహిత్‌‌, సూర్య, హార్దిక్‌‌ బ్యాటింగ్​ షో
  • చెలరేగిన బౌల్ట్‌‌, బుమ్రా, కర్న్‌‌ శర్మ

జైపూర్‌‌: ఐపీఎల్‌‌–18లో ముంబై ఇండియన్స్‌‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. రైన్‌‌ రికెల్టన్‌‌ (38 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 61), రోహిత్‌‌ శర్మ (36 బాల్స్‌‌లో 9 ఫోర్లతో 53) హాఫ్‌‌ సెంచరీలకు తోడు సూర్యకుమార్‌‌ (23 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 48 నాటౌట్‌‌), హార్దిక్‌‌ పాండ్యా (23 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 48 నాటౌట్‌‌) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ముంబై 100 రన్స్‌‌ తేడాతో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌పై నెగ్గింది. 

దీంతో వరుసగా ఆరో విజయంతో టాప్‌‌లో నిలిచింది. టాస్‌‌ ఓడిన ముంబై 20 ఓవర్లలో 217/2 స్కోరు చేసింది. తర్వాత రాజస్తాన్‌‌ 16.1 ఓవర్లలో 117 రన్స్‌‌కే ఆలౌటైంది. ఆర్చర్‌‌ (30) టాప్‌‌ స్కోరర్‌‌. బౌల్ట్‌‌ (3/28), కర్న్‌‌ శర్మ (3/23), బుమ్రా (2/15) ధాటికి రాయల్స్‌‌ ఇన్నింగ్స్‌‌ పేకమేడలా కూలింది. రికెల్టన్​కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. ఎనిమిది పరాజయాలతో రాజస్తాన్‌‌ ప్లే ఆఫ్స్‌‌ రేసు నుంచి నిష్క్రమించింది.

నలుగురే దంచిండ్రు..

ముంబై ఓపెనర్లు రోహిత్‌‌‌‌, రికెల్టన్‌‌‌‌ను కట్టడి చేయడంలో రాజస్తాన్‌‌‌‌ బౌలర్లు విఫలమయ్యారు. హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ 2 ఫోర్లతో, రికెల్టన్‌‌‌‌ 6, 4తో గాడిలో పడ్డారు. ఐదో ఓవర్‌‌‌‌లో రోహిత్‌‌‌‌ 4, రికెల్టన్‌‌‌‌ 4, 6తో 18 రన్స్‌‌‌‌ దంచారు. తర్వాతి ఓవర్‌‌‌‌లో రోహిత్‌‌‌‌ రెండు ఫోర్లు, రికెల్టన్‌‌‌‌ ఫోర్‌‌‌‌తో పవర్‌‌‌‌ప్లేలో ముంబై 58/0 స్కోరు చేసింది. ఫీల్డింగ్‌‌‌‌ విస్తరించిన తర్వాత కూడా రాజస్తాన్‌‌‌‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేదు. 9వ ఓవర్‌‌‌‌లో వీరిద్దరు రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌తో 16 రన్స్‌‌‌‌ రాబట్టారు. 

ఈ క్రమంలో రికెల్టన్‌‌‌‌ 29  బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేయగా ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో ముంబై స్కోరు 99/0కి పెరిగింది. 11వ ఓవర్‌‌‌‌లో 9 రన్స్‌‌‌‌ వచ్చినా 12వ ఓవర్‌‌‌‌లో తీక్షణ (1/47).. రికెల్టన్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి తొలి వికెట్‌‌‌‌కు 116 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేశాడు. 31 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన రోహిత్‌‌‌‌ను 13వ ఓవర్‌‌‌‌లో పరాగ్‌‌‌‌ (1/12) వెనక్కి పంపాడు. 123/2తో ఉన్న దశలో సూర్య, పాండ్యా నిలకడగా ఆడారు. 14వ ఓవర్‌‌‌‌లో మూడు ఫోర్లతో 16 రన్స్‌‌‌‌ చేశారు. చివరి 5 ఓవర్లలో 47 రన్స్‌‌‌‌ రావడంతో ముంబై 15 ఓవర్లలో 146/2 స్కోరు చేసింది. 16వ ఓవర్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌ 4, సూర్య సిక్స్‌‌‌‌ కొట్టగా, 17వ ఓవర్‌‌‌‌లో ఆర్చర్‌‌‌‌14 రన్స్‌‌‌‌ ఇచ్చాడు. 18వ ఓవర్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌ 4, 6, 4, 4తో 21 రన్స్‌‌‌‌ దంచాడు. తర్వాత సూర్య 4, 6 కొట్టాడు. చివరి మూడు ఓవర్లలో 42 రన్స్‌‌‌‌ వచ్చాయి.  

బౌలర్లు అదుర్స్‌‌‌‌..

భారీ ఛేదనలో రాజస్తాన్‌‌‌‌ టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ ముంబై బౌలింగ్‌‌‌‌ ముందు తేలిపోయింది. ఇన్నింగ్స్‌‌‌‌ నాలుగో బాల్‌‌‌‌కే గత మ్యాచ్‌‌‌‌ సెంచరీ హీరో వైభవ్‌‌‌‌ సూర్యవంశీ (0)ని దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌ (1/13) డకౌట్ చేశాడు. 1/1తో ఆట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్‌‌‌‌ (13), నితీశ్‌‌‌‌ రాణా (9)ను బౌల్ట్, బుమ్రా కుదురుకోనీయలేదు. జైస్వాల్‌‌‌‌ రెండు సిక్స్‌‌‌‌లు, రాణా రెండు ఫోర్లతో టచ్‌‌‌‌లో కనిపించినా వికెట్‌‌‌‌ కాపాడుకోలేకపోయారు. రెండు, నాలుగో ఓవర్లలో బౌల్ట్‌‌‌‌ దెబ్బకు ఈ ఇద్దరూ వెనుదిరిగారు. ఐదో ఓవర్‌‌‌‌లో బుమ్రా వరుస బాల్స్‌‌‌‌లో రియాన్‌‌‌‌ పరాగ్‌‌‌‌ (16), హెట్‌‌‌‌మయర్‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌కు పంపడంతో రాయల్స్‌‌‌‌ 47/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 

పవర్‌‌‌‌ప్లే ముగిసేసరికి 62/5తో ఎదురీత మొదలుపెట్టింది. ధ్రువ్‌‌‌‌ జురెల్‌‌‌‌ (11), శుభమ్‌‌‌‌ దూబే (15) ఆదుకునే ప్రయత్నం చేసినా సక్సెస్‌‌‌‌ కాలేదు. పాండ్యా (12), ఇంపాక్ట్‌‌‌‌గా వచ్చిన కర్న్‌‌‌‌ శర్మ వరుస ఓవర్లలో వీళ్లను ఔట్‌‌‌‌ చేయడంతో రాయల్స్‌‌‌‌ 76/7తో కూరుకుపోయింది. ఆర్చర్‌‌‌‌, తీక్షణ (2) మెల్లగా ఆడటంతో తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 82/7గా మారింది. 11వ ఓవర్‌‌‌‌లో బుమ్రా.. తీక్షణ క్యాచ్‌‌‌‌ను డ్రాప్‌‌‌‌ చేశాడు. కానీ 12వ ఓవర్‌‌‌‌లో కర్న్​ శర్మ.. తీక్షణ, కుమార్‌‌‌‌ కార్తికేయ (2)ను పెవిలియన్‌‌‌‌కు పంపాడు. 13వ ఓవర్‌‌‌‌లో ఆర్చర్‌‌‌‌ 6, 6, 4తో కాసేపు పోరాడినా 17వ ఓవర్‌‌‌‌లో బౌల్ట్‌‌‌‌ ఔట్​ చేయడంతో రాయల్స్‌‌‌‌ టార్గెట్ అందుకోలేకపోయింది. 

సంక్షిప్త స్కోర్లు

ముంబై: 20 ఓవర్లలో 217/2 (రికెల్టన్‌‌‌‌ 61, రోహిత్‌‌‌‌ 53, పరాగ్‌‌‌‌ 1/12). 

రాజస్తాన్‌‌‌‌: 16.1 ఓవర్లలో 117 ఆలౌట్‌‌‌‌ (ఆర్చర్‌‌‌‌ 30, పరాగ్‌‌‌‌ 16, బౌల్ట్‌‌‌‌ 3/28, కర్న్‌‌‌‌ శర్మ 3/23).