నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లకు రిపేర్లు .. ముందస్తు వర్షాలతో డ్యామ్ ఆఫీసర్లు అలర్ట్

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గేట్లకు రిపేర్లు .. ముందస్తు వర్షాలతో డ్యామ్ ఆఫీసర్లు అలర్ట్
  • ఇప్పటికే  13  క్రస్ట్ గేట్లకు మరమ్మతులు పూర్తి 
  • ఈనెల 20 లోపు నిర్వహణ పనులు కంప్లీట్  
  • మరోవైపు  జూరాల నుంచి శ్రీశైలానికి నీటి విడుదల 

నల్గొండ/హాలియా, వెలుగు : నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్ల మరమ్మతు పనులు ముమ్మరంగా కొనసాగుతోన్నాయి. వానాకాలం   షురూ కానున్న నేపథ్యంలో నిర్వహణ పనులను డ్యామ్ అధికారులు చేపట్టారు. ఏటాసాగర్ జలాశయానికి ఎగువ నుంచి వరద నీరు వచ్చే సమయానికి ముందే పనులను పూర్తి చేస్తుంటారు. ఈసారి జూన్ తొలివారంలోనే పనులను ప్రారంభించారు. ఇప్పటికే క్రస్ట్ గేట్లకు సంబంధించి అవసరమైన చోట్ల రబ్బర్ సీళ్లను అమర్చారు. దీంతోపాటు క్రస్ట్  గేట్ల నిర్వహణకు గ్రీజింగ్, ఆయిలింగ్ లాంటి పనులను స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. 

ముందుగానే వరద వచ్చే చాన్స్ ఉందని..  

సాధారణంగా సాగర్ డ్యామ్ కు జూలై చివరివారంలో లేదంటే ఆగస్టు తొలివారంలో వరద తాకిడి ఉంటుంది.  ఈసారి కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ముందస్తుగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ముందుగానే వరద వచ్చే చాన్స్ ఉందని డ్యామ్ అధికారులు అంచనా వేశారు. వరద తాకిడి మొదలయ్యే సమయానికి క్రస్ట్ గేట్లలో ఎలాంటి సమస్యలు రాకుండా, మొరాయించకుండా ప్రాజెక్టు గేట్ల మరమ్మతు పనులను చేపట్టారు.  మొత్తం 26 గేట్లు ఉండగా.. 1 నుంచి 13 వరకు సెంట్రల్ డ్రైవ్ యూనిట్లకు, ఎండ్ డ్రైవ్ యూనిట్లకు గ్రీజింగ్ కంప్లీట్ చేశారు. 

వీటితో పాటు రబ్బర్ సీళ్లు, రోప్ గ్రీజింగ్, గేట్లు ఎత్తడానికి, దింపడానికి వినియోగించే మోటర్ల రిపేర్లు చేస్తున్నారు.  శ్రీశైలం ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా మారింది. దీంతో మరో వారంలో సాగర్ క్రస్ట్ గేట్లకు సంబంధించిన పనులను పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈనెల 20 లోపు  పూర్తిస్థాయిలో పనులు పూర్తి చేయనున్నారు. 

శ్రీశైలం ప్రాజెక్ట్ కు నీటి రాకతో.. 

ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు ఇప్పటికే భారీగా వరద నీరు రావడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జులై లో శ్రీశైలం ప్రాజెక్టుకు మొదలయ్యే నీటి రాక ప్రస్తుతం జూన్ లోనే ప్రారంభమైంది.  ఇప్పటికే లక్ష క్యూసెక్కుల వరకు నీటిని శ్రీశైలానికి విడుదల చేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ 1,042.65 అడుగుల నీటి మట్టం ఉంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు 15,713 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.  ఈ ప్రాజెక్ట్ నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 835.30 అడుగుల నీటి మట్టం ఉండగా.. నెల రోజుల ముందుగానే నీటి రాక ఉంటుందని ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 

జులైలోనే సాగర్ కు నీటి విడుదల?

ఏటా సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు ఆగస్టులోనే సాగు నీటికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు సరిపడా వరద రాకపోవడంతో 2023 –- 24 సంవత్సరానికి ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. అయితే గతేడాది జులైలో నీటి విడుదల చేశారు. ఈసారి అదే నెలలో  నీటిని వదిలే చాన్స్ ఉంది.  సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 511.80 అడుగుల నీటి మట్టం ఉంది.  ఎగువ నుంచి 4,800 క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రస్తుతం ప్రాజెక్టులోకి వస్తోంది.  

త్వరలోనే రిపేర్లు పూర్తి చేస్తాం 

ప్రాజెక్టుకు ముందుగానే వరద వచ్చే అవకాశం ఉన్నందున సాగర్ గేట్ల రిపేర్లు వేగంగా పూర్తి చేస్తున్నాం. ప్రస్తుతం 13 గేట్లకు గ్రీజింగ్ పూర్తి చేశాం. మొత్తం 26 గేట్ల మరమ్మత్తులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహిస్తాం. ఈ నెల 20 వరకు పూర్తిస్థాయిలో సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్ల పనులు పూర్తి చేస్తాం. 

మల్లికార్జునరావు, సాగర్ డ్యామ్ ఇన్ చార్జ్ ఎస్ఈ