హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ఈ నెల 22న ప్రారంభం కానుంది. కృష్ణానది ఒడిలో, నల్లమల కొండల మధ్య నుంచి సాగే లాంచీ ప్రయాణం కోసం తెలంగాణ పర్యాటక శాఖ ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 22 శనివారం రోజున సాగర్ టు శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆఫీసర్లు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ నుంచి లాంచీలో శ్రీశైలం వరకు వెళ్లే ప్రయాణికులకు టికెట్ రేట్లను ఖరారు చేశారు. వన్ వే అయితే పెద్దలకు రూ. 2 వేలు, ఐదు నుంచి పదేండ్లలోపు పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. అదే రెండు వైపుల ప్రయాణానికైతే... పెద్దలకు రూ. 3,250 , పిల్లలకు రూ.2,600 చొప్పున రేట్లు ఖరారు చేశారు.
ప్రయాణంలో మధ్యాహ్నం భోజనాన్ని లాంచీలో ఏర్పాటు చేస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు 100 టికెట్లను బుక్ చేసుకుంటే.. సాగర్ నుంచి ప్రత్యేకంగా శ్రీశైలానికి లాంచీ ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కోసం www.tgtdc.in వెబ్సైట్ను సంప్రదించాలని ఆఫీసర్లు సూచించారు. మరిన్ని వివరాలకు హైదరాబాద్లోని బషీర్బాగ్ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్ 9848540371, 9848125720, నాగార్జునసాగర్ లాంచీ యూనిట్ 7997951023 నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
