
- కుటుంబ సభ్యులకు తేల్చి చెప్పిన చత్తీస్గఢ్ పోలీసులు
- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన నంబాల సోదరుడు
- కేశవరావుపై విష ప్రయోగం జరిగిందంటున్న పౌర హక్కుల నేతలు
భద్రాచలం, వెలుగు: మావోయిస్టు చీఫ్ కమాండర్ నంబాల కేశవ రావు డెడ్బాడీని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చత్తీస్గఢ్ పోలీసులు నిరాకరించారు. అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల డెడ్బాడీలను ఆర్మీ హెలికాప్టర్ ద్వారా నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. నంబాల డెడ్బాడీ తీసుకునేందుకు అతని సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు నారాయణపూర్ వెళ్లారు. డెడ్బాడీ చూయించకుండా వాళ్లను ఎస్పీ ఆఫీస్లో నిర్బంధించినట్లు తెలిసింది.
డెడ్బాడీ ఇచ్చేది లేదని, వెంటనే నారాయణపూర్ వదిలివెళ్లిపోవాలని చెప్పినట్లు సమాచారం. డెడ్బాడీ అప్పగింతపై పోలీసులను నిలదీయగా.. పోలీసులు వారిపట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రీకాకుళం ఎస్పీ ఫోన్ చేసి.. ‘‘చత్తీస్గఢ్ ఎందుకు వెళ్లారు? వెంటనే అక్కడి నుంచి వచ్చేయండి’’అని ఆదేశించినట్లు నంబాల సోదరుడు అన్నారు. దీంతో నంబాల డెడ్బాడీ అప్పగింతపై శుక్రవారం ఆయన సోదరుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.
నంబాలను బతికున్నప్పుడే పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి చంపారని, అందుకే డెడ్బాడీ అప్పగించడం లేదని వామపక్ష పార్టీలు, పౌరహక్కుల, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నంబాలపై విషప్రయోగం జరిగిందని అంటున్నారు. డెడ్బాడీ అప్పగిస్తే రీ పోస్ట్మార్టం కోసం కోర్టుకు వెళ్తారన్న భయంతోనే మృతదేహం ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. అలిపిరి బ్లాస్ట్లో నంబాల సూత్రధారి.
మంత్రి అచ్చెనాయుడు తన సొంత గ్రామానికి అతని డెడ్బాడీ తీసుకురానివ్వకుండా అడ్డుపడుతున్నారన్న వాదన కూడా వినిపిస్తున్నది. కాగా, నంబాల డెడ్బాడీ వద్ద నుంచి ఆయన డైరీ, ల్యాప్టాప్, ఇతర డాక్యుమెంట్లను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ కగార్ తీవ్రత, డీఆర్జీ బలగాల దూకుడుపై దళాలను అలర్ట్ చేస్తూ లేఖ రాసినట్లు తెలుస్తున్నది. ప్రమాదాన్ని ముందే పసిగట్టి అగ్రనేతలను దాటించే క్రమంలోనే నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో చనిపోయినట్లు తెలుస్తున్నది.