పవిత్ర రంజాన్ మాసంలో దాదాపు 60 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ వెల్లడించింది. సాధారణ నెలలతో పోలిస్తే బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయంది. 10 లక్షల బిర్యానీ, 5.3 లక్షల హలీమ్లను ఆర్డర్ చేయడంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించింది. రంజాన్ సందర్భంగా సాధారణ రోజులతో పోలిస్తే దేశవ్యాప్తంగా ప్రసిద్ధ వంటకాలకు ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి.
బిర్యానీ, హలీంలతో పాటు సమోసాలు, భాజియా, మల్పువా, ఫిర్ని, రబ్ది లాంటి ఫుడ్ ఐటెమ్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ సైతం భారీగా ఆర్డర్స్ వచ్చాయి. హలీమ్ 1454.88 శాతం భారీ పెరుగుదలను నమోదు చేయగా, ఫిర్ని 80.97 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది.
మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం పెరిగాయి. ఫలుదా 57,93 శాతం, డేట్స్ 48.40 శాతం పెరిగాయని స్విగ్గీ వెల్లడించింది. రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది. ఉపవాసాలు చేస్తున్న ముస్లింలు తమ దీక్ష విరమించేందుకు స్విగ్గీ లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీలకే ఎక్కవ మొగ్గు చూపారు.