- మంత్రి వివేక్ను కోరిన నీలం మధు ముదిరాజ్
పటాన్చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్కు మంత్రి హాజరు కాగా.. ఇస్నాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో నెలకొన్న పలు సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ చిట్కుల్ పరిధిలోని 329 కాలనీతో పాటు ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారని, వాటికి రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, కరెంట్, తాగునీటి సౌకర్యం, ఇంటి నంబర్లు.. వంటి మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. నేషనల్ హైవే నుంచి లక్డారం– -బ్యాతోల్– -రుద్రారం-– ఎర్ధనూర్ వరకు ఉన్న రహదారికి ఇరువైపులా హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు నారాయణదాసు, రాఘవేందర్, వెంకటేశ్నాయక్, లీడర్లు నర్సింహారెడ్డి, గోపాల్, దస్తగిరి, మణికంఠ, వెంకటేశ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
