
ఖాట్మండు: నేపాల్లో పలు సోషల్ మీడియా యాప్లను ప్రభుత్వం బ్యాన్ చేయడాన్ని నిరసిస్తూ జెన్ జెడ్ యువత చేపట్టిన ఆందోళనలకు నేపాల్ సర్కార్ తలొగ్గింది. దేశ రాజధాని ఖాట్మండులో నిరసనలు హింసాత్మకం కావడం, దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొనడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) ఇన్స్టా గ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా యాప్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేశారు. సోమవారం (సెప్టెంబర్ 8) జరిగి అత్యవసర కేబినెట్ భేటీలో ప్రధాని కేపీ శర్మ ఓలీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కాగా, నేపాల్లో పలు సోషల్ మీడియా యాప్లను ప్రభుత్వం బ్యాన్ చేయడాన్ని నిరసిస్తూ వేలాది మంది యువత సోమవారం (సెప్టెంబర్ 8) ఉదయం చేపట్టిన ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. నేపాల్ రాజధాని ఖాట్మండులోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఖాట్మండులో జరిగిన కాల్పుల్లో 17 మంది, సన్సారి జిల్లాలో జరిగిన ఫైరింగ్లో ఇద్దరు నిరసనకారులు చనిపోయారని పోలీసులు ప్రకటించారు.
దాదాపు 347 మంది గాయపడ్డారు. పొఖారా, బట్వాల్, భైరహవా, భరత్ పూర్, ఇటహరి, దమక్ ప్రాంతాలకు కూడా నిరసనలు వ్యాపించాయని తెలిపారు. ఆందోళనల సందర్భంగా పార్లమెంట్ భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పార్లమెంట్ ముట్టడికి యత్నించిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన ఆందోళనకారులు పార్లమెంట్ భవనం మొదటి గేటుకు నిప్పు పెట్టారు.
యువత చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్రరూపం దాల్చుతుండటంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ సోమవారం (సెప్టెంబర్ 8) అత్యవసర కేబినెట్కి పిలుపునిచ్చారు. ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
మంత్రి మండలి సమావేశానికి ముందు హోంమంత్రి రమేశ్ లేఖక్, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్, విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబా, రక్షణ మంత్రి మన్ బీర్ రాయ్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్, ఉన్నతాధికారులతో ప్రధాని ఓలీ సమీక్ష చేపట్టారు. ఈ భేటీ తర్వాత హోంశాఖ మంత్రి రమేశ్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. నిరసనలు హింసాత్మకంగా మారడం, ఖాట్మండు సహా ఇతర సిటీలకూ వ్యాపించడంతో పాటు 19 మంది మృతి చెందడానికి నైతిక బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా ‘జన్ జడ్ రెవల్యూషన్’..
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వ అవినీతి, బంధుప్రీతికి వ్యతిరేకంగా జనరేషన్ జడర్స్ (1996 నుంచి 2010 మధ్య పుట్టినవారు) కొద్దిరోజులుగా ‘జన్ జడ్ రెవల్యూషన్’ పేరుతో మార్పు కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తున్నారు. దీనికితోడు గురువారం వాట్సాప్, ఫేస్ బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి 26 సోషల్ మీడియా యాప్స్ను సర్కారు బ్యాన్ చేయడంతో జనరేషన్ జడ్ యువత సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. వీరికి జనరేషన్ వై (మిలీనియల్స్: 1981 నుంచి 1996 మధ్య పుట్టినవారు) యువత కూడా జత కలిశారు.
టిక్ టాక్, రెడిట్ వంటి ప్రత్యామ్నాయ సోషల్ మీడియా వేదికల ద్వారా సమాచారం పంచుకున్న వేలాది మంది యువతీయువకులు ఖాట్మండులో భారీ ఆందోళనలు చేపట్టారు. ఉదయం నుంచే యువత జాతీయ జెండాలు చేతపట్టి, జాతీయ గీతం ఆలపిస్తూ వీధుల్లో కదం తొక్కారు. ఎక్కువమంది స్కూల్, కాలేజీ యూనిఫాంలు ధరించి, ప్లకార్డులతో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. ‘సోషల్ మీడియాను కాదు.. కరప్షన్ను షట్ డౌన్ చేయండి’, ‘సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలి’ అని నినాదాలు చేశారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం, మార్పు రావాలని డిమాండ్ చేశారు.
సోషల్ మీడియాపై బ్యాన్ ఎందుకు..?
నేపాల్లో సేవలు అందించే సోషల్ మీడియా కంపెనీలు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని కేపీ శర్మ ఓలి సర్కారు ఇదివరకే ఆదేశించింది. టిక్ టాక్ తోపాటు మరికొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో వాటిని మినహాయించి మిగతా 26 యాప్స్ను ప్రభుత్వం గురువారం బ్యాన్ చేసింది.
దేశంలో సేవలు అందించే యాప్స్ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలని, దేశాన్ని తక్కువ చేసి చూపిస్తే.. ఉపేక్షించేదిలేదని ప్రధాని ఓలి హెచ్చరించారు. కాగా, రూల్స్ పాటించని కారణంగానే సోషల్ మీడియా యాప్లపై బ్యాన్ విధించామని.. కానీ భావప్రకటన స్వేచ్ఛను హరించేందుకే బ్యాన్ చేసినట్టు తప్పుడు ప్రచారం జరగడం వల్లే నిరసనలు వెల్లువెత్తాయని ప్రభుత్వం తెలిపింది.