న్యూఢిల్లీ: అకౌంట్ పాస్వర్డ్స్ షేర్ చేసుకోవడంపై నెట్ఫ్లిక్స్ మరిన్ని రిస్ట్రిక్షన్లు పెట్టింది. ఫ్యామిలీకి వెలుపల వారితో పాస్వర్డ్స్ షేర్ చేసుకోవడంపై రూల్స్ కఠినం చేస్తున్న కంపెనీ తాజాగా ఇండియాలో కూడా ఇటువంటి రూల్స్ అమలు చేస్తోంది. ‘ఒక నెట్ఫ్లిక్స్ అకౌంట్ ఒక కుటుంబానికి మాత్రమే. ఒకే ఇంటిలో నివసిస్తున్న వారందరూ తమకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ను షేర్ చేసుకోవచ్చు. సరికొత్త ఫీచర్లను వాడుకోవచ్చు’ అని నెట్ఫ్లిక్స్ ఇండియా ఓ స్టేట్మెంట్లో పేర్కొంది.
ఒకే ఇంటిలో నివసిస్తున్న వారు మాత్రమే నెట్ఫ్లిక్స్ అకౌంట్ను వాడుకోవాలని, కుటుంబానికి వెలుపల వారు వాడుకోవడానికి వీలులేదంటూ కంపెనీ తన యూజర్లకు మెయిల్స్ పంపుతోంది. యూజర్లు తమ ప్రొఫైల్ను సపరేట్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని, కొత్తగా సపరేట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చని వెల్లడించింది. నెట్ఫ్లిక్స్ అకౌంట్ను ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం ఇండియాలో కామన్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్తో అకౌంట్ పంచుకొని ఖర్చు తగ్గించుకుంటారు. కంపెనీ కొత్త రూల్స్తో దీనికి ముగింపు రానుంది. మరోవైపు అదనంగా చెల్లించి ఫ్రెండ్స్తో పాస్వర్డ్ షేర్ చేసుకునే వెసులుబాటును యూఎస్లో కలిపిస్తోంది.
పాస్వర్డ్ షేర్ అవుతుందని ఎలా గుర్తిస్తారంటే?
యూజర్ల ఐపీ అడ్రస్, డివైజ్ ఐడీ, లాగిన్ అయిన డివైజ్లలో అకౌంట్ యాక్టివిటీని నెట్ఫ్లిక్స్ పరిశీలిస్తుంది. ఐపీ అడ్రస్ ద్వారా ఇంటికి వెలుపల ఉన్నవారు అకౌంట్ను వాడుకోవడం కష్టంగా మారుతుంది. ఇంటికి వెలుపల ఉన్నవారు అకౌంట్ను వాడుకోవాలంటే యాక్సెస్ కోడ్ను ఎంటర్ చేయాలని నెట్ఫ్లిక్స్ అడుగుతుంది. ఈ విధానంలో ఏడు రోజుల వరకు వాడుకోవచ్చు. అదనంగా యూజర్లు తమ ఇంటి వైఫైని నెలలో ఒక్కసారి అయినా కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఈ రూల్స్ పెద్దగా యూజర్లను ఇబ్బంది పెట్టవని నెట్ఫ్లిక్స్ పేర్కొంది.
కానీ, ఎలా ఈ ప్లాన్స్ను అమలు చేస్తుందో చెప్పలేదు. బహుశా డివైజ్ ఐడీని బట్టి యూజర్లను వెరిఫై చేయొచ్చని ఎనలిస్టులు అంచనా. ఇండియా వంటి మార్కెట్లలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ల రేట్లను తగ్గించామని, అందుకే పెయిడ్ షేరింగ్ ఆఫర్ను ఈ మార్కెట్లలో తీసుకురామని ప్రకటించింది. కాగా, 4కే కంటెంట్ను నాలుగు డివైజ్లు యూజ్ చేసుకోవడానికి నెలకు రూ.649 ధరతో ప్లాన్ అందుబాటులో ఉంది. ఇండియాలో కంపెనీ అమలు చేస్తున్న కాస్ట్లీ ప్లాన్ ఇదే. పాస్వర్డ్ షేరింగ్కు బ్రేక్లేయడంతో తమ బిజినెస్ మెరుగయ్యిందని కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 59 లక్షల మంది కొత్త యూజర్లు యాడ్ అయ్యారని వెల్లడించింది.