- ఏవియేషన్ సెక్టార్ కోసం 25 వేల కోట్లు
- ఇందుకోసం డెవెలప్మెంట్ ప్రోగ్రాం
- పీపీపీ పద్ధతిలో కొత్త ఎయిర్పోర్టులు
- వీటి నిర్మాణానికి రూ.30 వేల కోట్లు
- ప్రకటించిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ
న్యూఢిల్లీ: దేశమంతటా ఎయిర్పోర్టుల డెవెలప్మెంట్ కోసం రాబోయే ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటించింది. కరోనా వల్ల దెబ్బతిన్న ఏవియేషన్ సెక్టార్ను ఆదుకోవడానికి ఒక డెవెలప్మెంట్ ప్రోగ్రామ్ను అమలు చేస్తామని వెల్లడించింది. ఈ డబ్బును ఇప్పటికే ఉన్న టెర్మినల్స్, కొత్త టెర్మినల్స్, రన్వేలు, ఎయిర్పోర్ట్ నావిగేషన్ సర్వీసెస్, కంట్రోల్ టవర్లు, టెక్నికల్ బ్లాక్లు మొదలైన వాటిని డెవెలప్చేయడానికి, విస్తరించడానికి వాడతారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులోని మూడు పబ్లిక్ -ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ఎయిర్పోర్టులు కూడా 2025 నాటికి డెవెలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం రూ.30 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. అంతేగాక పీపీపీ పద్ధతిలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుల ఏర్పాటుకు రూ.36 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 21 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించింది. మహారాష్ట్రలోని షిర్డీ, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్, సిక్కింలోని పాక్యోంగ్, కేరళలోని కన్నూర్, ఆంధ్రప్రదేశ్లోని ఓర్వకల్లు, కర్ణాటకలోని కలబురగి, మహారాష్ట్రలోని సింధుదుర్గ్, ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్లో ఇది వరకే ఎనిమిది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు ప్రారంభమయ్యాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ వీకే సింగ్ పార్లమెంటుకు తెలిపారు. ఎయిర్పోర్టుల డొమెస్టిక్ మెయింటనెన్స్, రిపేర్, ఓవర్హాల్ (ఎంఆర్ఓ) సర్వీసులపై జీఎస్టీని 18 శాతం నుంచి ఐదుశాతానికి తగ్గించారు. ఎయిర్పోర్ట్ లీజింగ్, ఫైనాన్సింగ్ను పెంచడానికి తగిన చర్యలు తీసుకున్నామని సింగ్ వివరించారు. అయితే కరోనా వల్ల గత ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఎయిర్లైన్ కంపెనీలకు రూ.19,564 కోట్లు, ఎయిర్పోర్టులకు రూ.5,116 కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు. ఇండియన్ క్యారియర్ల దగ్గర 2018 లో 7 కార్గో విమానాలు ఉండగా, ఈ ఏడాది వీటి సంఖ్య 28కి చేరింది. దీంతో గ్లోబల్ ఫ్రీట్ మార్కెట్లో ఇండియావాటా గత రెండేళ్లలో రెండు శాతం నుంచి 19 శాతానికి పెరిగింది.
ఉడాన్తో చిన్న సిటీలకు విమానాలు..
ఉడాన్ స్కీము కింద ఈ ఏడాది నవంబర్ 24 నాటికి రెండు వాటర్ ఏరోడ్రోమ్లు, ఆరు హెలిపోర్ట్లతో సహా 62 చిన్న విమానాశ్రయాలను కలుపుతూ 393 రూట్లను ప్రారంభించారు. 2017 ఏప్రిల్ నుండి ఈ ఏడాది దాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్యూలు, ఏఏఐకు చెందిన విమానాశ్రయాలు/హెలిపోర్ట్లు/వాటర్డ్రోమ్ల పునరుద్ధరణ కోసం రూ.2,062 కోట్ల దాకా విడుదల చేశాయి. ఉడాన్–3 కింద వాటర్ ఏరోడ్రోమ్ల నుండి కొత్త రవాణా విధానం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు గుజరాత్, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ రాష్ట్రాల్లో మొత్తం 14 వాటర్ ఏరోడ్రోమ్లను గుర్తించారు. మహమ్మారి కారణంగా విమానాలను రద్దు చేయడంతో మనదేశ విమానయాన రంగం 2020-–21 ఆర్థిక సంవత్సరంలో రూ.వేలకోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ‘‘కరోనా వల్ల గత మార్చి నుండి చాలా విమానాలను తాత్కాలికంగా నిలిపేశాం. గత మే 25 నుండి 33 శాతం కెపాసిటీతో తిరిగి విమానాలు మొదలయ్యాయి. కరోనా మహమ్మారి తగ్గడంతో ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి రిస్ట్రిక్షన్లను ఎత్తేశాం. కంపెనీలు ఎక్కువ చార్జీలు వసూలు చేయకుండా చూస్తున్నాం’’ అని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తెలిపింది.