ఏటీఎం ఛార్జీల పెంపు నేటి నుంచే

ఏటీఎం ఛార్జీల పెంపు నేటి నుంచే

ముంబై: ఉచిత లావాదేవీల తర్వాత జరిపే ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు నేటి నుంచి పెరుగుతున్నాయి. జనవరి 1, 2022 నుంచి ఏటీఎం ట్రాన్సాక్షన్లకు రూ. 21 చొప్పున చెల్లించాలని జూన్​ 2021లోనే రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటిదాకా ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు రూ. 20 గా ఉన్నాయి. ప్రతీ కస్టమర్​కు తన సొంత బ్యాంక్​ ఏటీఎంలలో  నెలకు 5 ఉచిత లావాదేవీలు యథాప్రకారం కొనసాగుతాయి. ఇంటర్​ ఛేంజ్​ ఫీను రూ. 15 నుంచి రూ. 17 కి పెంచుకోవడానికి బ్యాంకులకు ఆర్​బీఐ గతంలోనే అనుమతి ఇచ్చింది. నాన్ ఫైనాన్షియల్​ ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఈ ఇంటర్​ ఛేంజ్​ ఫీని రూ. 6 కి పెంచింది. ఈ మార్పు గత ఏడాది ఆగస్టు 1 నుంచే అమలులోకి వచ్చింది. ఏటీఎంల ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఛార్జీలను పెంచినట్లు ఆర్​బీఐ తెలిపింది. ఏటీఎం ఛార్జీల రివ్యూ కోసం జూన్​ 2019లో ఒక కమిటీని  ఆర్​బీఐ నియమించింది. ఈ కమిటీకి చైర్మన్​గా ఐబీఏ సీఈఓ వ్యవహరించారు. దేశంలో 1,15,605 ఆన్​సైట్​ ఏటీఎంలు, 97,970 ఆఫ్​సైట్​ ఏటీఎంలు ఉన్నాయి. బ్యాంకులన్నీ కలిపి మార్చి 2021 చివరి నాటికి  జారీ చేసిన డెబిట్​ కార్డుల సంఖ్య 90 కోట్లు. మన దేశంలోని మొదటి ఏటీఎంను హెచ్​ఎస్​బీసీ బ్యాంకు 1987లో ముంబైలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 12 ఏళ్లలో 1,500 ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ఇంటరాపరబుల్​ ట్రాన్సాక్షన్ల కోసం స్వధన్​ నెట్​వర్క్​ను 1997 లో ఇండియన్​ బ్యాంక్స్​ అసోసియేషన్​ (ఐబీఏ) మొదలు పెట్టింది.