- గత నెలకొత్త బిజినెస్ ప్రీమియాల విలువ రూ.34 వేల కోట్లు
న్యూఢిల్లీ: భారతదేశ జీవిత బీమా రంగం వరుసగా రెండో నెలలోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. గత నెల కొత్త బిజినెస్ ప్రీమియాల విలువ ఏడాది ప్రాతిపదికన 12.1 శాతం పెరిగి రూ. 34,007 కోట్లకు చేరుకుందని కేర్ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్, ఐఆర్డీఏఐ నుంచి ఈ వివరాలు సేకరించినట్టు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టులో ప్రీమియాలు విలువ 5.2 శాతం తగ్గగా, గత నెల భారీగా పెరిగింది.
ముఖ్యంగా ఇండివిడ్యువల్ సెగ్మెంట్, నాన్-సింగిల్ ప్రీమియం పాలసీలు భారీగా అమ్ముడయ్యాయి. ఇండివిడ్యువల్ జీవిత బీమా ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు నిర్ణయం కూడా బీమా కంపెనీలకు మేలు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ మొదటిస్థానాన్ని నిలబెట్టుకోగా, ప్రైవేట్ బీమా కంపెనీలు కూడా రెండంకెల వృద్ధిని సాధించాయి. ఇండివిడ్యువల్, నాన్-సింగిల్ పాలసీల నుంచి ప్రీమియం భారీగా పెరిగింది.
ఎస్ఎల్ఐసీ కొత్త బిజినెస్ ప్రీమియం 17 శాతం వృద్ధి
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ఎల్ఐసీ) 2026 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో (హెచ్1)లో ఇండివిడ్యువల్ కొత్త బిజినెస్ ప్రీమియం (ఎన్బీపీ)లో ఏడాది ప్రాతిపదికన 17 శాతం వృద్ధి సాధించింది. గత హెచ్1లో ఇది రూ. 542 కోట్లు ఉండగా, 2026 ఆర్థిక సంవత్సరం హెచ్1లో రూ. 635 కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో ప్రైవేట్ రంగం 8 శాతం వృద్ధి చెందింది. రెన్యువల్ ప్రీమియాలు 2026 ఆర్థిక సంవత్సరం హెచ్1లో 43 శాతం పెరిగాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 2025 ఆర్థిక సంవత్సరానికి 98.31 శాతంగా ఉంది. 2026 హెచ్1లో కంపెనీ 37,850 ఇండివిడ్యువల్ గ్రూప్ పాలసీలను సెటిల్ చేసింది. ఎస్ఎల్ఐసీ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) విలువ సెప్టెంబర్ నాటికి రూ. 14,187 కోట్లకు చేరింది.
