బిజినెస్ డెస్క్, వెలుగు: కొత్త సంవత్సరం వచ్చేసింది. జనవరి 1 నుంచి కొన్ని నియమాలు/పద్ధతులు మారుతున్నాయి. కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. బ్యాంక్ లాకర్ నుంచి సీఎన్జీ, ఎల్పీజీ ధరల నుంచి క్రెడిట్ కార్డ్ల వరకు నూతన విధానాలు అమలుకానున్నాయి. ఇవి సామాన్యుడి జేబుపై ప్రభావం చూపుతాయి ఈ నియమాలు ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. అందుకే కొత్త రూల్స్/కొత్త మార్పులపై ఒక లుక్కేద్దాం.
బ్యాంక్ లాకర్లు
కొత్త బ్యాంక్ లాకర్ నిబంధనల ప్రకారం ఆర్బీఐ వినియోగదారులకు నూతన లాకర్ ఒప్పందాలను అందించాలని బ్యాంకులను ఆదేశించింది. ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం లాకర్ ఒప్పందాలలో ఎటువంటి అన్యాయమైన నిబంధనలు లేదా షరతులు ఉండకుండా బ్యాంకులు చూడాలి. స్టాంప్ పేపర్ పై లాకర్ ఒప్పందం జరగాలి. ఇందులో లాకర్ నియమ నిబంధనలు పొందుపరిచి, నకలు కాపీని వినియోగదారుడికి అందించాలి. ఒప్పందం తప్పకుండా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఉండాలి. దొంగతనం, అగ్ని ప్రమాదం, బ్యాంకు బిల్డింగ్ కూలిపోవడం.. తదితర ప్రమాదాలు జరిగినపుడు లాకర్ కు వసూలు చేసిన ఫీజుకు వంద రెట్లు ఎక్కువ మొత్తాన్ని వినియోగదారుడికి చెల్లించాలి.
హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు
2019 ఏప్రిల్ నెలకు ముందు రిజిస్టర్ చేసుకున్న వెహికల్స్కు 2022 డిసెంబర్ 31లోపు హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (హెచ్ఎస్ఆర్పీ) కలర్- కోడెడ్ స్టిక్కర్లను ఇన్స్టాల్ చేయడం తప్పనిసరని అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లేకపోతే జరిమానాలు విధిస్తామని, ఇవి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఉంటాయని హెచ్చరించింది.
క్రెడిట్ కార్డ్ల రివార్డులు
క్రెడిట్ కార్డ్ చెల్లింపుల కోసం కొత్త సంవత్సరంలో అనేక బ్యాంకులు తమ రివార్డ్ పాయింట్ స్కీమ్లను మార్చుతున్నట్టు ప్రకటించాయి. కాబట్టి కస్టమర్లు తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లను డిసెంబర్ 31లోపు రిడీమ్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డులతో రెంట్చెల్లించిన మొత్తానికి రివార్డు పాయింట్లు ఇవ్వబోమని హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులు
ప్రకటించాయి.
కార్ల ధరలు: చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి దేశీయ కార్ల కంపెనీలతోపాటు ఆడి, మెర్సిడెస్-బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్లు ఉన్నాయి. 2022లోనూ దాదాపు అన్ని కంపెనీలూ ధరలను పెంచాయి. రా మెటీరియల్ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపాయి. ఇదిలా ఉంటే ఎల్పీజీ, సీఎన్జీ ధరలు ప్రతి నెలా ఒకటో తేదీన మారుతుంటాయి. ఈ విషయాన్నీ గుర్తుంచుకోవాలి.
ప్రావిడెంట్ ఫండ్లో..
సుప్రీం కోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన చందాదారులు ఇక నుంచి అధిక పెన్షన్ ఆప్షన్ను ఎంచుకోవచ్చని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని ఈపీఎఫ్ను కేంద్రం ఆదేశించింది. ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయానికి తగిన ప్రచారం కల్పించాలని ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు వచ్చాయి. అధిక పెన్షన్కు అర్హులైన చందాదారులు కమిషనర్ సూచించిన దరఖాస్తు ఫారమ్లో జాయింట్ డిక్లరేషన్ సహా మొదలైన అన్ని ఇతర అవసరమైన పత్రాలను అందించాలి.
ఎన్పీఎస్ పార్షియల్ విత్డ్రాయల్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) కోసం తమ విత్డ్రాయల్ రిక్వెస్ట్లను ఇక నుంచి వారి అనుబంధ నోడల్ కార్యాలయాల ద్వారా సమర్పించాలి. పాక్షిక ఉపసంహరణ ఎందుకో వివరిస్తూ సంబంధిత డాక్యుమెంట్లను అందజేయాలి. ప్రస్తుతం, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) సభ్యులు ‘సెల్ఫ్ డిక్లరేషన్’ ద్వారా ఎన్పీఎస్ కింద కొంత డబ్బు తీసుకోవచ్చు. ఇక నుంచి సెల్ఫ్డిక్లరేషన్ద్వారా పాక్షికంగా డబ్బు తీసుకోవడానికి అంగీకరించబోమని అథారిటీ తెలిపింది.