- గుండె, కిడ్నీలు, లంగ్స్పైన ప్రభావం
- షుగర్ బారిన పడుతున్న జనాలు
- రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్
- ఎటాక్ చేస్తున్న ఫంగస్, బ్యాక్టీరియా
- మానసిక సమస్యలతో సతమతం
- పిల్లల్లో టైప్ వన్ డయాబెటీస్
హైదరాబాద్, వెలుగు: కరోనా కొత్త బీమార్లను తీసుకొస్తోంది. కరోనా తగ్గిందని ఊపిరి పీల్చుకునే లోపలే చాలా మందిలో షుగర్, బీపీ, లంగ్ ఫైబ్రోసిస్, హార్ట్ ఎటాక్ వంటి జబ్బులొస్తున్నాయి. బ్లాక్ ఫంగస్, క్యాండిడా వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఎటాక్ చేస్తున్నాయి. కొంత మందిలో కిడ్నీలు ఫెయిలవడం, అర్థరైటీస్, థైరాయిడ్ వంటి జబ్బులు బయటపడుతున్నాయి. దవాఖాన్ల నుంచి డిశ్చార్జయిన సగం మందిలో పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్లు కనిపిస్తున్నాయి. కనీసం పది శాతం మంది ఆత్మహత్యలకు సంబంధించిన ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నట్టు డాక్టర్లు చెప్తున్నారు. కరోనాతో తీవ్రంగా జబ్బు పడిన పిల్లల్లో టైప్ వన్ డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక జబ్బులు కూడా వస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ దవాఖాన్లకు పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్స్తో వందల మంది పేషెంట్లు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ దవాఖాన్లలోనూ పోస్ట్ కొవిడ్ ఓపీ, ఐపీ సేవలు ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇమ్యూనిటీ సిస్టమ్ అతిగా స్పందించడంతోనే..!
మన శరీరంలోకి కరోనా వైరస్ ఎంటర్ కాగానే దాన్ని ఎదుర్కొనేందుకు మన ఇమ్యూనిటీ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది. యాంటిబాడీస్ను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, కొంత మందిలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఓవర్గా రెస్పాండ్ అవడం వల్ల, సైటోకైన్ స్టార్మ్ ఏర్పడి లెక్కలేనన్ని యాంటిబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి కరోనాతో పాటు, మన శరీరంపైన కూడా దాడి చేస్తున్నాయి. దీని వల్లే బ్లడ్ క్లాట్స్, టిష్యూ డ్యామేజ్ వంటి పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ బ్లడ్ క్లాట్స్ వల్ల రక్తప్రసరణ దెబ్బతిని గుండె పోటు వంటి ప్రాణాంతక జబ్బులు తలెత్తుతున్నాయి. ఈ యాంటీబాడీస్ను కట్టడి చేసేందుకు ఇమ్యూనిటీని తగ్గించే స్టెరాయిడ్స్ను వాడాల్సి వస్తోంది. అప్పటివరకూ స్టెరాయిడ్స్ ఉపయోగపడినా, అటు తర్వాత ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మ్యూకర్మైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కరోనా సోకిన చాలా మందిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. కొన్ని రోజుల పాటు తక్కువ ఆక్సిజన్ లెవల్స్తో నెట్టుకొస్తున్నారు. దీంతో గుండెకు, లంగ్స్కు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. ఆక్సిజన్ తగ్గడం.. ఆ ప్రభావం గుండె కండరాలపై పడడం వల్ల కొంత మంది గుండెపోటు వచ్చి చనిపోతున్నారని కార్డియాలజిస్టులు చెప్తున్నారు. చాలా మందిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా లంగ్స్ పనితీరు పూర్తిస్థాయిలో మెరుగవడం లేదు. వీళ్లు జీవితాంతం లంగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాల్సిందేనని పల్మనాలజిస్టులు సూచిస్తున్నారు.
జీవితాంతం షుగర్తో తిప్పలే
కరోనా సోకిన చాలా మందిలో డయాబెటీస్ సమస్య వస్తోంది. ముందే డయాబెటీస్ ఉన్నవాళ్లలో కరోనా వల్ల షుగర్ లెవల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం కరోనాతోనే కొంత మంది డయాబెటీస్ పేషెంట్లుగా మారుతున్నారు. పాంక్రియాజ్పై కరోనా ఎటాక్ చేయడం వల్లే ఇలా జరుగుతోందని డాక్టర్లు చెప్తున్నారు. పాంక్రియాజ్లో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీట కణాలు ఉంటాయి. వైరస్ ఈ కణాల్లోకి చొరబడి, వాటిని నాశనం చేస్తోంది. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం/ఆగిపోవడం జరుగుతోందని డాక్టర్లు అంటున్నారు. దీంతో బ్లడ్లో చక్కెర లెవల్స్ అమాంతం పెరుగుతున్నాయి. కరోనా తర్వాత కొన్ని రోజులకు షుగర్ లెవల్స్ తగ్గుతున్నా, పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు. కొంత మందిలో షుగర్ ఉన్నా, కరోనా తర్వాత ఆ విషయం బయటపడుతుండగా, ఇంకొంత మంది కరోనా కారణంగానే షుగర్ బాధితులుగా మారుతున్నారు. పిల్లల్లోనూ ఈ సమస్య తలెత్తుతోందని డాక్టర్లు చెప్తున్నారు.
పిల్లల్లో టైప్ వన్ డయాబెటీస్
కరోనా సోకిన పిల్లల్లో కొంతమంది టైప్ వన్ డయబెటీస్ బారిన పడుతున్నారు. పాంక్రియాజ్పై కరోనా దాడి వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతోంది. ఇక జీవితాంతం వాళ్లు ఇన్సులిన్ వాడాల్సిందే. అయితే, ఇది చాలా అరుదుగా, కొన్ని కేసుల్లో మాత్రమే కనిపిస్తోంది. పెద్ద వాళ్లలో మాత్రం ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయి. షుగరే కాదు.. పోస్ట్ వైరల్ రియాక్టివ్ అర్థరైటీస్, థైరడైటీస్ వంటి సమస్యలు కూడా వస్తున్నయి.
- డాక్టర్ అమిత్ గోయల్, ఎండోక్రైనాలజిస్ట్, ఈఎన్టీ హాస్పిటల్, సనత్నగర్
50% మందిలో యాంగ్జయిటీ
కరోనా ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికెళ్లిన చాలా మంది పోస్ట్ ట్రామాటిక్ స్ర్టెస్ డిజార్డర్స్తో బాధ పడుతున్నారు. సగం మందిలో యాంగ్జయిటీ కనిపిస్తోంది. నిద్రపట్టకపోవడం, సూసైడల్ థాట్స్, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్ వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యా యత్నం చేసినవాళ్లూ ఉన్నారు. ఇవన్నీ తగ్గడానికి చాలా టైమ్ పడుతోంది. కరోనా పేషెంట్ల విషయంలో ఇంట్లో వాళ్లు చాలా కేర్ తీసుకోవాలి.
- డాక్టర్ అజయ్, సైకియాట్రిస్ట్, గాంధీ హాస్పిటల్
ఇమ్యూనిటీని పెంచుకోవాలి
కరోనా ఎక్కువగా మన ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతోంది. ఇమ్యూనిటీ లేకపోవడంతో నీరసం, ఒళ్లు నొప్పులు, నిద్రలేమి వంటి అనేక సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే డాక్టర్ సూచించిన మెడిసిన్స్ వాడుతూ రెస్ట్ తీసుకోవాలి. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారంలో అన్ని రకాల పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి రోజూ తీసుకోవాలి. షుగర్, బీపీ రెగ్యులర్గా చెక్ చేయించుకోవాలి. గుండె, బ్రెయిన్ సంబంధిత సమస్యలున్నోళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి. కరోనా రీఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు మాస్క్, హైజీన్, సోషల్ డిస్టెన్సింగ్ తప్పకుండా పాటించాలి.
– డాక్టర్ రాజేంద్ర ప్రసాద్,కియా హాస్పిటల్, కరీంనగర్
రక్తం గడ్డకట్టడమే సమస్య
పోస్ట్ కొవిడ్లో లంగ్, హార్ట్, కిడ్నీ సమస్యలతో చాలా మంది హాస్పిటల్కు వస్తున్నారు. రక్తంలో ఏర్పడుతున్న క్లాట్స్తోనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడి, బ్లడ్ ప్రెజర్ తగ్గుతోంది. హార్ట్కు, బ్రెయిన్కు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే స్ట్రోక్, ఇతర సమస్యలు వస్తాయి. కరోనా పేషెంట్లలో జరుగుతున్నది ఇదే. కిడ్నీల ఫంక్షనింగ్ దెబ్బతినడానికి కూడా ఇదే రీజన్. లంగ్స్కు ఆక్సిజన్, బ్లడ్ సరఫరా ఆగిపోయి లంగ్ ఫైబ్రోసిస్ వస్తోంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జయిన తర్వాత కూడా డాక్టర్లను సంప్రదించి సలహాలు తీసుకోవాలని పేషెంట్లకు చెప్తున్నాం. బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయా, లేదా అనేది డీడైమర్ వంటి టెస్టుల ద్వారా ముందే గుర్తించొచ్చు.
‑ డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ హాస్పిటల్
ఇవీ సమస్యలు
- కొందరిలో కరోనా తగ్గాక డయాబెటీస్ సమస్య వస్తోంది. ముందే డయాబెటీస్ ఉన్నవాళ్లలో కరోనా వల్ల షుగర్ లెవల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి.
- ఇంకొందరిలో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఊపిరితిత్తుల పనితీరు మెరుగవడం లేదు. కిడ్నీల ఫంక్షనింగ్ కూడా సరిగా ఉండడం లేదు.
- మరికొందరిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. దీంతో గుండెకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదు. ఆ ప్రభావం గుండె కండరాలపై పడి గుండె పోటు వస్తోంది.
- నిద్రపట్టకపోవడం, ఆత్మహత్య ఆలోచనలు, అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్, లోన్లీనెస్ వంటి ఇబ్బందులతో కొందరు బాధపడుతున్నారు.
- ట్రీట్మెంట్ టైమ్లో స్టెరాయిడ్స్ వాడిన వాళ్లలో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మ్యూకర్ మైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి.