నవోదయకు ముందడుగు .. సూర్యాపేటలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు

నవోదయకు ముందడుగు .. సూర్యాపేటలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు
  • ఈ విద్యాసంవత్సరం నుంచి   రెడ్డి హాస్టల్ లో ఏర్పాట్లు
  • 6వ తరగతిలో 40మంది విద్యార్థులకు ప్రవేశాలు
  • జూలై 14న తరగతులు ప్రారంభం
  • శాశ్వత భవన నిర్మాణానికి కోదాడలో 19ఎకరాల స్థలం గుర్తింపు

సూర్యాపేట వెలుగు: సూర్యాపేట జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయానికి ముందడుగు పడింది. తెలంగాణ లో 7 జవహర్ నవోదయ విద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో  తాత్కాలికంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది నుండి కోదాడలో పర్మినెంట్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలం కోసం ఇటీవల ఆఫీసర్లు సర్వే చేపట్టగా    ఈ విద్యా సంవత్సరం నుంచి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్లో స్కూలును ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే ఆరో తరగతిలో ఎంట్రెన్స్ కోసం టెస్ట్ నిర్వహించారు. వచ్చే నెల 14 న తరగతులు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు.

కార్పొరేట్ స్థాయిలో టీచింగ్

జవహర్ నవోదయ విద్యాలయంలో కార్పొ రేట్ స్థాయిలో  నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యనందించనున్నారు. అయితే ఇందులో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు చదువు కునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇప్పటికే అర్హత పరీక్ష సైతం నిర్వహించారు. మెరిట్ ఆధారంగా విద్యార్థుల అడ్మి షన్లు తీసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో 40 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. ఈ విద్యా సంవత్సరాన్ని జూలై 14న  ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఇందులో బోధించేందుకు అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని కేటాయించారు.

ఈ ఏడాది సూర్యాపేట జిల్లా కేంద్రంలో 

ఈ సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు రావడంతో జిల్లా కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీని కోసం జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ భవనం లో విద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో హాస్టల్, తరగతి గదుల్లో ఫర్నిచర్, ఇతర మెటీరియల్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు భోజనం చేసేందుకు మెస్ హాల్, బాత్రూంలు, టాయిలెట్లు, బెడ్స్ లు సిద్ధం చేస్తున్నారు. 

కోదాడలో ప్రభుత్వ స్థలం కోసం సర్వే

సూర్యాపేట జిల్లాకు జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తూ గత ఏడాది డిసెంబర్ 6న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలో అధికారులు విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి స్థలం కోసం సర్వే చేశారు. మొదట గరిడేపల్లి మండలం గడ్డిపల్లిలో 25 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. కానీ అది స్కూల్ భవన నిర్మా ణానికి అనుకూలంగా లేదు. దీంతో కోదాడ కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీకాలేజీ స్థలంలో నిర్మించడానికి కలెక్టర్, ఆర్డీఓ నేతృత్వంలో 19 ఎకరాలను గుర్తించి సెంట్రల్ కమిటీ కి నివేదిక పంపించారు. ఆ కమిటీ కూడా ఈ స్థలాన్ని పరిశీలించి వెళ్లింది. వచ్చే ఏడాది వరకు శాశ్వత భవనంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.