- ఎలాంటి ఇబ్బందులూ ఉండవు డీజీఎఫ్టీ వెల్లడి
న్యూఢిల్లీ : ఐటీ హార్డ్వేర్ ప్రొడక్టుల దిగుమతులకై ఆన్లైన్ అథరైజేషన్ సిస్టమ్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త పద్ధతి వెంటనే అమలులోకి వస్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారనాగి గురువారం మీడియాకు వెల్లడించారు. విశ్వసనీయమైన సోర్సుల నుంచే దిగుమతులు వస్తున్నాయా లేదా అనేది మానిటర్ చేయడానికి ఈ కొత్త విధానం వీలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. దిగుమతులపై ఆంక్షలు తెచ్చిన నేపథ్యంలో కొన్ని పరిశ్రమ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని రూల్స్ను కొంత సరళం చేశారు.
ఆన్లైన్ అథరైజేషన్ సిస్టమ్దిగుమతిదారులకు ఎలాంటి ఇబ్బందులూ సృష్టించదని, అధికారుల ప్రమేయం అసలే ఉండదని సారనాగి వివరించారు. ఐటీ హార్డ్వేర్ ప్రొడక్టులు దిగుమతి చేసుకోవాలంటే లైసెన్సులు తప్పనిసరని ఈ ఏడాది ఆగస్టు 4 నాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమలవుతుందని కూడా అప్పుడు ప్రకటించింది. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులు తగ్గించి, దేశంలో ఐటీ హార్డ్వేర్ ప్రొడక్టుల తయారీ పెంచాలనేది కూడా ప్రభుత్వ టార్గెట్. ఏ దేశం నుంచైనా ఎంత పరిమాణంలోనైనా, ఏ విలువున్న ప్రొడక్టులనైనా దిగుమతి చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చని డీజీఎఫ్టీ వెల్లడించారు.
కొత్త సిస్టమ్ తేవడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తన వంతు పాత్ర పోషించింది. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్కు 10 నిమిషాలు పడుతుందని, సింపుల్ లైసెన్స్ ఆటోమేటిక్గానే జారీ అవుతుందని డీజీఎఫ్టీ చెప్పారు. తిరస్కరానికి గురైన జాబితాలోని కంపెనీలకు మాత్రం అథరైజేషన్స్ దొరకవని స్పష్టం చేశారు. సెకండ్ హ్యాండ్ లేదా రీఫర్బిష్డ్ ఐటమ్స్ దిగుమతి కంపెనీలకు కూడా అథరైజేషన్ దొరకదని వివరించారు. ఎందుకంటే, ఆ ఐటమ్స్కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వేరుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆన్లైన్ అథరైజేషన్ సిస్టమ్ తెచ్చినప్పటికీ, ఐటీ హార్డ్వేర్ ప్రొడక్టులు రెస్ట్రిక్టెడ్ కేటగిరీలోనే కొనసాగుతాయని, అందులో ఎలాంటి మార్పు లేదని డీజీఎఫ్టీ స్పష్టం చేశారు.