పద్మారావునగర్, వెలుగు: మంచిర్యాల జిల్లాకు చెందిన కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఇబ్బంది పడుతున్నారని, వారికి రక్షణ కల్పించాలని కోరుతూ న్యాయవాది రామారావు ఇమ్మనేని శుక్రవారం జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించారు. దుబాయ్, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ దేశాల్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ కార్మికుల దుస్థితిపై కేసు నమోదు చేసింది. కార్మికులకు రావాల్సిన బకాయి వేతనాలు, నష్టపరిహారం వెంటనే చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. కార్మికులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
