జమ్మూ కశ్మీర్లో టెర్రరిస్టులకు సహకరిస్తున్న నలుగురు వ్యక్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. దేశ రాజధానితో సహా కొన్ని నగరాల్లో దాడులకు పలు టెర్రర్ గ్రూపులు కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం అందడంతో ఎన్ఐఏ రెయిడ్స్ నిర్వహించింది. ఈ దాడుల్లో నలుగురు టెర్రరిస్టు సానుభూతిపరులను అదుపులోకి తీసుకుంది. వీరిని వసీం అహ్మద్ సోఫీ, తారిఖ్ అహ్మద్ దార్, బిలాల్ అహ్మద్ మీర్ అలియాస్ బిలాల్ ఫఫూ, తారిఖ్ అహ్మద్ బఫండాగా గుర్తించారు.
జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో నిర్వహించిన దాడుల్లో వీరిని పట్టుకున్నామని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. అరెస్ట్ అయిన వాళ్లు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్గా ఉంటూ ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు సమకూర్చడంలో సాయం అందిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎన్ఐఏ పేర్కొంది. లోయలో గతంలో జరిగిన పలు టెర్రర్ దాడుల్లో వీరికి ప్రమేయమున్నట్లు అధికారులు తెలిపారు. సోదాల సందర్భంగా టెర్రరిస్టు అసోసియేట్ల నుంచి పలు ఎలక్ట్రానిక్ డివైజ్లు, జిహాదీ డాక్యుమెంట్లు, అనుమానాస్పద వ్యాపార లావాదేవీల రికార్డులను సీజ్ చేశామని ఎన్ఐఏ ప్రతినిధి చెప్పారు.