సోఫియా (బల్గేరియా): ఇండియా స్టార్ బాక్సర్, తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్లో ముచ్చటగా మూడోసారి గోల్డ్ నెగ్గేందుకు ఒకే ఒక్క పంచ్ దూరంలో నిలిచింది. మెగా టోర్నీలో సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న నిఖత్ ఫైనల్ చేరుకుంది. ఆమెతో పాటు మరో ఐదుగురు ఇండియా బాక్సర్లు టైటిల్ ఫైట్కు దూసుకెళ్లారు.
శనివారం జరిగిన విమెన్స్ 50 కేజీ సెమీఫైనల్లో నిఖత్ 5–0తో ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, లోకల్ స్టార్ జ్లతిస్లావా చుకొనోవాను చిత్తు చేసింది. తొలి రౌండ్ కాస్త జాగ్రత్తగా ఆడిన నిఖత్ తర్వాతి రెండు రౌండ్లలో పవర్ఫుల్ పంచ్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆదివారం జరిగే ఫైనల్లో సబినా బొబొకులోవా (ఉజ్బెకిస్తాన్)తో నిఖత్ గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది.
66 కేజీ సెమీస్లో అరుంధతి చౌదరి 5–0తో జెస్సికా ట్రైబెలోవా (స్లొవేకియా)ను చిత్తు చేసింది. మెన్స్ 51 కేజీ సెమీస్లో అమిత్ పంగల్ 5–0తో గుముస్ సమెత్(టర్కీ)ని ఓడించి వరుసగా మూడోసారి ఫైనల్ చేరాడు. బరుణ్ సింగ్ (48 కేజీ) కూడా 5–0తో ఖనౌసి (అల్గేరియా)ను చిత్తు చేయగా, సచిన్ (57) 4–1తో ఐడర్ (ఉక్రెయిన్)పై గెలిచాడు. ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో రజత్ (67 కేజీ) నేరుగా ఫైనల్లో అడుగు పెట్టాడు.